Breaking News

సర్కారు స్కూళ్లలో అన్ని హంగులు

  • శ్రీకాకుళం కలెక్టర్ జె.నివాస్

సారథి న్యూస్, శ్రీకాకుళం: గ్రానైట్ ఫ్లోరింగ్ తో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారనున్నాయని శ్రీకాకుళం కలెక్టర్ జె.నివాస్ అన్నారు. శనివారం స్థానిక కలెక్టర్ బంగ్లాలో జిల్లాలోని గ్రానైట్ ఫ్యాక్టరీల అసోసియేషన్ తో సమావేశం నిర్వహించారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా రూపొందించడం కోసమే సీఎం వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి నాడు.. నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను నూతన హంగులు సమకూర్చనున్నామని తెలిపారు.

నీటి సరఫరా, టాయిలెట్ల నిర్మాణం, విద్యుత్ సరఫరా, ఫ్యాన్లు, ఫర్నిచర్, లైట్లు ఏర్పాటుచేసి విద్యార్థులకు మంచి సౌకర్యాలను కలిగించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 1,239 స్కూళ్లలో గ్రానైట్ తో ఫ్లోరింగ్ చేసి తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. లక్ష చదరపు అడుగుల గ్రానైట్ మెటీరియల్ సప్లై చేయాలని గ్రానైట్ కంపెనీలను కలెక్టర్ కోరారు. సమావేశంలో డీఐసీ జనరల్ మేనేజర్ గోపాలకృష్ణ, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఈఈ కె.భాస్కరరావు, మైన్స్ డీడీసీ హెచ్.సూర్య చంద్రరావు, గ్రానైట్ ఫాక్టరీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గోపి, వైస్ ప్రెసిడెంట్ డీవీ ప్రసాద్, సోము, అర్జున్, వెంకటేశ్వర రావు, రమాకాంత్ రెడ్డి, ఇండస్ట్రియల్ పార్కు చైర్మన్ ఎంఎంవీ సురేష్ పాల్గొన్నారు.