![శానిటైజర్ కోసం వచ్చి గోల్ట్షాపు లూటీ](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/robbery.jpg?fit=677%2C461&ssl=1)
లక్నో: కరోనా పుణ్యమా! అని ప్రజలందరిలోనూ శానిటైజర్, మాస్కుల వినియోగం భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లోని ఓ దొంగల ముఠా దీనినే ఆసరాగా చేసుకుని బంగారు నగల దుకాణాన్ని లూటీ చేసింది. సాధారణ కస్టమర్ల మాదిరిగానే నగల షాపులోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు అక్కడ నగలు అమ్మే వ్యక్తి ముందు శానిటైజర్ కోసం చేయి చాచాడు. అతడు కూడా వచ్చినవారు కస్టమర్లు కావచ్చు అనుకుని వారి చేతికి శానిటైజర్ ద్రావణాన్ని చల్లాడు. అంతే.. ఇంతలోనే ఒక దొంగ తన వద్ద ఉన్న పిస్టల్ తీసి అతనికి గురిపెట్టాడు. ఇదే సమయంలో దుకాణంలోకి వచ్చిన మూడవ దొంగతో కలిసి అక్కడే ఉన్న రెండో దొంగ.. కౌంటర్ మీద ఉన్న బంగారు నగలను బ్యాగులోకి సర్దాడు. తుపాకీతో వచ్చిన వ్యక్తి క్యాష్ కౌంటర్ వద్దకు వెళ్లి అందులో ఉన్న నగదు, ఇతర ఆభరణాలను తీశాడు. ఆ సమయంలో షాపులో ఉన్న ముగ్గురు కస్టమర్లకు ఏమవుతుందో తెలిసేలోపే.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ముగ్గురు సభ్యుల దొంగల ముఠా.. రూ.40లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ.40వేల దాకా నగదును ఎత్తుకెళ్లింది. షాపులో ఉన్న సీసీటీవీ పుటేజీలో రికార్డయిన ఇదంతా కేవలం 30 సెకన్లలోనే జరిగిపోవడం గమనార్హం. దీనిపై షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీసీటీవీ పుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకుంటామని తెలిపారు.