Breaking News

వాడీవేడిగా మానవపాడు జనరల్​బాడీ మీటింగ్​

వాడీవేడిగా మానవపాడు జనరల్​బాడీ మీటింగ్​

సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. సమస్యలపై నిలదీస్తూ పలువురు సర్పంచ్​లు సమావేశాన్ని అడ్డుకున్నారు. పంచాయతీలో చేస్తున్న ప్రతి పనికి కమీషన్లు అడుగుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని అధికారుల తీరుకు నిరసనగా జడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య, సర్పంచ్​లతో కలిసి నేలపై కూర్చుని నిరసన తెలిపారు. బుధవారం ఎంపీడీవో ఆఫీసులో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ కోట్ల అశోక్​రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జడ్పీ చైర్​పర్సన్ సరిత తిరుపతయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మీటింగ్​ ప్రారంభంకాగానే పలువురు సర్పంచ్​లు నిరసన తెలిపారు. ఏ చిన్న పనికైనా కమీషన్లు అడుగుతున్నారని వాపోయారు. సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని జడ్పీ చైర్​పర్సన్ ​సరిత తిరుపతయ్య హామీ ఇచ్చారు. తహసీల్దార్ కార్యాలయంలో కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు రైతులకు సంబంధించిన పనులు ముందుకు సాగడం లేదని కలుకుంట్ల సర్పంచ్ ఆత్మలింగారెడ్డి, పల్లెపాడు సర్పంచ్ ​విజయమ్మ అన్నారు. చండూరు గ్రామంలో వేలిముద్రలు సరిపడక రేషన్​ బియ్యం, ఆసరా పింఛన్లు రావడం లేదని ఎన్నిసార్లు సభ దృష్టికి తీసుకొచ్చినా లాభం లేదని వాపోయారు. ఇలా ఎన్ని సమావేశాల్లో చర్చించుకోవాలని గ్రామ సర్పంచ్ నర్సింహులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉపాధి పనులు చేస్తున్నారా..? లేదా? అనే విషయం కూడా సర్పంచ్​లకు తెలియడం లేదని కొంతమంది సర్పంచ్​లు, అమరవాయి ఎంపీటీసీ రోశన్న మండిపడ్డారు. హెల్త్​డిపార్ట్​మెంట్​కు సంబంధించిన సమస్యలను సర్పంచ్ ​నారాయణ లేవనెత్తారు. సర్వసభ్య సమావేశానికి హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల సర్పంచ్​లు, ఎంపీటీసీలు జడ్పీ చైర్​పర్సన్ సరితకు ఫిర్యాదు చేశారు.