Breaking News

లోకల్​ బ్రాండ్స్ కే నా సపోర్టు

న్యూఢిల్లీ: లోకల్ బ్రాండ్స్.. గతకొద్ది రోజులుగా విపరీతంగా వినిపిస్తున్న మాట ఇది. కరోనా దెబ్బతో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే విదేశీ బదులుగా స్వదేశీ బ్రాండ్లను వాడాలని కోరుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియామీర్జా కూడా ఇందులో చేరింది. మన ఆర్థిక వ్యవస్థను బాగు చేసుకోవాలంటే భారత్​లో తయారయ్యే ఉత్పత్తులకే ప్రజలు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సానియా పిలుపునిచ్చింది.

ఈ మేరకు ‘సపోర్ట్‌ స్మాల్‌ బై సానియా’ అనే హాష్‌ ట్యాగ్‌తో తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది. ‘నేను లోకల్‌, భారత్ యూనిక్ బ్రాండ్స్ కోసం చూస్తున్నా. మీవి అలాంటి సంస్థలైతే మీ వివరాలు నాకు మెయిల్‌ చేయండి. మీ ప్రొడక్ట్స్‌ గురించి చెప్పిండి. లోకల్‌ బ్రాండ్స్‌ వాడకంపై గతంలో కంటే ఎక్కువగా ఇతరులను ప్రోత్సహించండి. మేడిన్‌ ఇండియా బ్రాండ్స్ అయితే మెసేజ్‌ లేదా మెయిల్‌ ద్వారా నాకు వివరాలు తెలియజేయండి. నాకు నచ్చిన 20 బ్రాండ్స్‌ గురించి సోషల్‌ మీడియాలో నేను చెబుతా’ అంటూ సానియా పేర్కొంది. ఈ కష్టకాలంలో ప్రతిఒక్కరూ పరస్పరం సాయం చేసుకుంటూ దేశ సమగ్రతకు కృషిచేయాలని ఈ హైదరాబాదీ వ్యాఖ్యానించింది.