Breaking News

రోహిత్.. చాలా కూల్

టీమిండియా మాజీ బ్యాట్స్​మెన్​ వీవీఎస్ లక్ష్మణ్

న్యూఢిల్లీ: ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురైనా.. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడమే.. ఐపీఎల్​లో కెప్టెన్​గా రోహిత్ శర్మ సక్సెస్​ అయ్యాడని టీమిండియా మాజీ బ్యాట్స్​మెన్​ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. బ్యాట్స్​మెన్​ స్థాయి నుంచి సారథిగా ఈ ముంబైకర్ ఎదిగిన తీరు చాలా అద్భుతంగా ఉందని కొనియాడాడు. ‘2008 రోహిత్ డెక్కన్ చార్జర్స్​కు ఆడాడు. అప్పుడు అతనో కుర్రాడు. భారత్ తరఫున టీ20 ప్రపంచకప్ మాత్రమే ఆడాడు. అరంగేట్రం ఐపీఎల్ లో డీసీ ప్రదర్శన బాగాలేదు. అయినా రోహిత్ మాత్రం చాలా బాగా ఆడాడు. ఒత్తిడిలోనూ మిడిలార్డర్​లోనూ పరుగులు చేసేవాడు. జట్టు అవసరాల మేరకు ఎక్కడైనా బ్యాటింగ్ చేసేందుకు రోహిత్ సిద్ధంగా ఉంటాడు. అదే అతన్ని గొప్ప ప్లేయర్​గా నిలబెట్టింది’ అని లక్ష్మణ్ వివరించాడు.

డీసీకి ఆడుతున్నప్పుడే రోహిత్ నాయకుడిగా ఎదిగాడన్నాడు. ‘ప్రతి మ్యాచ్​కు రోహిత్​లో ఆత్మవిశ్వాసం పెరిగేది. టీమ్​లో కీలకసభ్యుడిగా మారిన తర్వాత కుర్రాళ్లకు అండగా నిలిచాడు. ప్రతి ఒక్కరికి చాలా సలహాలు, సూచనలు ఇచ్చేవాడు. విషయమేదైనా తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పేవాడు. ఓ నాయకుడిగా ఎదగడానికి ఇవన్నీ ముందస్తు లక్షణాలు. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండడం రోహిత్​లో చూశా. నా వరకైతే ఇది చాలా కీలకమని నమ్ముతా’ అని ఈ హైదరాబాదీ వ్యాఖ్యానించాడు.