Breaking News

రైతులకు ఏ ఇబ్బంది రానివ్వం

రైతులకు ఏ ఇబ్బంది రానివ్వం

సారథి న్యూస్, మెదక్: రైతులకు ఏ ఇబ్బంది రానివ్వబోమని, పంటల సాగుకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని మంత్రి హరీశ్​రావు భరోసా ఇచ్చారు. శనివారం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని శివంపేట మండలం కొత్తపేట, రత్నాపూర్ గ్రామాల్లో డంపింగ్ యార్డులను ప్రారంభించారు. కొత్తపేట గ్రామంలో మొక్కలు నాటి, రత్నాపూర్ గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి భూమిపూజ చేశారు. నాట్లు వేస్తున్న రైతుల వద్దకు వెళ్లి ఏయే పంటలు వేస్తున్నారు, పంట నియంత్రిత సాగు విధానంతో కలిగే లాభాలను తెలుసుకున్నారు.
నర్సాపూర్ ను ముందంజలో ఉంచుదాం
అభివృద్ధి విషయంలో మెదక్ జిల్లాలోనే నర్సాపూర్ నియోజకవర్గాన్ని ముందంజలో ఉంచాలని, అందుకు అందరి సహకారం అవసరమని మంత్రి తన్నీరు హరీశ్​రావు అన్నారు. శనివారం నర్సాపూర్ పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డితో కలిసి పర్యటించారు. నర్సాపూర్ పట్టణంలో డిపో నిర్మాణ పనులు చాలా ఆలస్యంగా జరుగుతున్న విషయాన్ని గుర్తించి వెంటనే సంబంధిత కాంట్రాక్టర్ తో ఫోన్​లో మాట్లాడారు. డిపో నిర్మాణం ఆగస్టు 31వ తేదీ వరకు పూర్తిచేయాలని, అలాగే డిపోకు సంబంధించిన కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని పదిరోజుల్లో కంప్లీట్​చేయాలని ఆదేశించారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా చర్యలు తప్పవన్నారు. నర్సాపూర్ పట్టణంలో రైతువేదిక, వైకుంఠధామాలను పరిశీలించిన మంత్రి పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ మంత్రి సునితారెడ్డి, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్ పాల్గొన్నారు.