Breaking News

రంజీ జట్టులో మళ్లీ శ్రీశాంత్!

చెన్నై: స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో నిషేధానికి గురైన భారత మాజీ పేసర్ శ్రీశాంత్ మళ్లీ క్రికెట్ ఆడే అవకాశాలున్నాయి. పూర్తి ఫిట్​గా ఉంటే అతన్ని కేరళ రంజీ జట్టులోకి తీసుకుంటామని కోచ్ టీనూ యోహనన్ చెప్పాడు. ‘ఈ ఏడాది రంజీ సీజన్​కు శ్రీశాంత్ ను తీసుకోవాలనుకుంటున్నామన్నారు. ఈ సెప్టెంబర్ 13న అతనిపై నిషేధం ముగుస్తుంది. అతనికి మళ్లీ పోటీ క్రికెట్లోకి రావడానికి చాలినంత సమయం కూడా ఉంది. కాకపోతే అతను క్రికెట్ ఆడి ఏడేండ్లు అవుతోంది. ఈ మధ్యకాలంలో అతని ఫిట్నెస్ ఎలా ఉందో చూడాలి. ఆటపై కూడా ఓ అంచనాకు రావాలి’ అని యోహనన్ పేర్కొన్నాడు. మళ్లీ క్రికెట్లోకి రావాలనుకుంటున్నట్లు శ్రీశాంత్ కూడా వెల్లడించాడు. ఫిట్​నెస్​ కోసం పూర్తి స్థాయిలో శ్రమిస్తున్నానని చెప్పాడు. టీంమిండియా తరఫున 27 టెస్టులు, 53 వన్డేలు ఆడిన శ్రీశాంత్.. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్​కు పాల్పడినందుకు 2013లో బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది.