Breaking News

మనమే అగ్రగామి

  • తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు తీరాయి
  • మిషన్ భగీరథతో మంచినీళ్ల గోస తీరింది
  • అన్నిరంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించాం
  • రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితం
  • తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో సీఎం కేసీఆర్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఏ సమస్యలు తీరుతాయని ఆశించామో, ఆ సమస్యలు పరిష్కారమవుతున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రైతులు, వ్యవసాయం పరిస్థితి దారుణంగా ఉండేదన్నారు. నేడు తెలంగాణ వ్యవసాయం దేశంలోనే అగ్రగామిగా ఉందని పునరుద్ఘటించారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎదురుగా గన్ పార్కు అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ప్రగతి భవన్ లో జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎండాకాలం వస్తే ప్రజలు మంచినీళ్ల కోసం గోస పడేవారని, నేడు మిషన్ భగీరథతో ఆ సమస్య పరిష్కారమైందని చెప్పారు. విద్యుత్, సాగునీరు, విద్య, వైద్య, పారిశ్రామిక, ఐటీ తదితర రంగాల్లో ఎంతో ప్రగతి సాధించామని సంతృప్తి వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయాణం అనుకున్న రీతిలో ఎంతో ఆశావహంగా ప్రారంభమైందన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్​ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, ప్రజల సంక్షేమానికి పాటుపడడం కోసం ప్రభుత్వం పునరంకితం అవుతుందని సీఎం ప్రకటించారు. ఎంపీలు కె.కేశవరావు, జె.సంతోష్ కుమార్, కేఆర్ సురేశ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ, మహేందర్ రెడ్డి, ఏసీబీ డీజీ పూర్ణచందర్ రావు, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫజీయుద్దీన్, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, నాగేందర్, ఆత్రం సక్కు, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శ్రీనివాసరెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, కార్పొరేషన్ల చైర్మన్లు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాసరెడ్డి, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.