Breaking News

భూ వివాదంలోనే రామచంద్రారెడ్డి హత్య

సారథి న్యూస్​, షాద్​నగర్​: ఈనెల 19న రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో కిడ్నప్ నకు గురై కొత్తూరు మండలంలోని పెంజర్ల గ్రామ శివారులో విగతజీవిగా పడి ఉన్న రామచంద్రారెడ్డి హత్య కేసులో నిందితులను షాద్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. భూవివాదమే ప్రాణం తీసినట్లు పోలీసులు తేల్చారు. సోమవారం వివరాలను షాద్ నగర్ ఏసీపీ సురేందర్ వెల్లడించారు. ఫరూక్ నగర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి, ప్రతాప్ రెడ్డికి కొంతకాలంగా భూ వివాదాలు ఉన్నాయి. 35ఎకరాల భూమికి సంబంధించి కోర్టులో కూడా కేసులు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే ఒకరిపై మరొకరు మరోసారి ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ క్రమంలో ప్రతాప్ రెడ్డి, డ్రైవర్ విజయ్ ఇద్దరు కక్ష గట్టి రామచెంద్రారెడ్డిని కత్తితో పొడిచిచంపారు. ఐపీసీ 430, 364, 302, 34 సెక్షన్ల కింద కేసులు నమోదుచేసినట్లు ఏసీపీ సురేందర్​ తెలిపారు. సమావేశంలో షాద్ నగర్ టౌన్ సీఐ శ్రీధర్ కుమార్, షాద్ నగర్ రూరల్ సీఐ రామకృష్ణ పాల్గొన్నారు.