Breaking News

ఫీజులు పెంచితే గుర్తింపు రద్దు

ఫీజులు పెంచితే గుర్తింపు రద్దు

మంత్రి సబితా ఇంద్రారెడ్డి

సారథి న్యూస్​, హైదరాబాద్​: రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రైవేట్​ పాఠశాలలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఏ రూపంలోనూ ఫీజులు పెంచొద్దు అని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘిస్తే గుర్తింపు రద్దు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీచేశారు. ఈ నెల 21 నుంచి ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు నిర్వహిస్తామన్నారు. టీ శాట్‌ ద్వారా రోజుకో సబ్జెక్ట్‌ డిజిటల్‌ పాఠాల బోధన జరుగుతుందన్నారు.www.scert.telangana.gov.in వెబ్‌సైట్‌లో ఈ-పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉన్నాయని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. రాష్ట్రంలో పది వేలకు పైగా ప్రైవేట్​ పాఠశాలలు ఉన్నాయని, 30 లక్షల మందికి పైగా విద్యార్థులు ఉన్నారని, ఈ క్రమంలో ప్రైవేట్​ స్కూళ్ల యాజమాన్యాలు ఎట్టి పరిస్థితుల్లో ఫీజులు పెంచొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించిన విషయం విదితమే. పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఇబ్బంది పెడితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సీఎం సూచించారు. ట్యూషన్‌ ఫీజు కాకుండా అదనంగా ఒక్క పైసా వసూలు చేసిన.. ఆయా పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామని సీఎం కేసీఆర్‌ హెచ్చరించారు.