Breaking News

నిరుద్యోగ భృతి ఇవ్వాలి

నిరుద్యోగ భృతి ఇవ్వాలి

సారథి న్యూస్, హుస్నాబాద్: గత ఎన్నికల్లో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తక్షణమే నిరుద్యోగ భృతి అమలు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) రాష్ట్ర కార్యదర్శి మారుపక అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ జిల్లా ముఖ్యకార్యకర్తల సమావేశం గురువారం జిల్లా కేంద్రంలోని ఎడ్ల గురువారెడ్డి భవన్ లో జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో నిరుద్యోగుల ఓట్లను ఆకర్షించేందుకు నిరుద్యోగ భృతి నెలకు రూ.3116 ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు. అధికారంలోకి రాగానే నిరుద్యోగులను మరిచిపోయిందని విమర్శించారు. కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన ప్రైవేట్​ టీచర్లను ఆదుకోవాలని డిమాండ్​ చేశారు. మహిళల రక్షణకు చట్టాలను మరింత పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. మహిళలను హింసిస్తున్న దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కనుకుంట్ల శంకర్, జిల్లా సహాయ కార్యదర్శి జనగామ రాజ్ కుమార్, ఉపాధ్యక్షుడు బొడ్డు నరేష్, భాస్కర్, అనిల్, శ్రీను, అశోక్, రంజిత్, వెంకట్ పాల్గొన్నారు.