![‘దుబ్బాక’ కౌంటింగ్ కు రెడీ](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/11/DBK-22.jpg?fit=677%2C450&ssl=1)
సారథి న్యూస్, దుబ్బాక: ఈనెల 10న నిర్వహించనున్న దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేశామని దుబ్బాక ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి చెన్నయ్య చెప్పారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీమతి భారతి హోళీకేరి ఆదేశాల మేరకు కౌంటింగ్ కేంద్రం వద్ద అన్ని మౌలిక వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. బ్రాండ్బ్యాండ్ ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు వీడియోగ్రఫీ చేస్తున్నామని చెప్పారు. కౌంటింగ్ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్దేశిత వెబ్సైట్లో రౌండ్ వారీగా పొందుపరుస్తామని వివరించారు. నవంబర్ 10న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని, ముందుగా పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుందని, అరగంట తర్వాత ఈవీఏంలలో లెక్కింపు ప్రారంభించనున్నట్లు ఆర్వో పేర్కొన్నారు. కౌంటింగ్ చేపట్టే అధికారిక సిబ్బంది నియామకం, వారికి శిక్షణ సైతం పూర్తయినట్లు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కావాల్సిన వివిధ శాఖల అధికారిక సిబ్బంది నియామకం, శిక్షణ కూడా పూర్తయిందని, భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఓట్ల లెక్కింపును చేపట్టాలని అధికార వర్గాలకు ఆదేశించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సిద్దిపేట అర్బన్ తహసీల్దార్ విజయ్, డీపీఆర్వో దశరథం, రేడియో ఇంజనీర్ గోపాల్, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/11/DUBBAKA1.jpg?resize=640%2C425&ssl=1)
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/11/DBK33.jpg?resize=580%2C353&ssl=1)