Breaking News

దళిత చైతన్య ప్రతీక.. భాగ్యరెడ్డి వర్మ

  • మే 22న భాగ్యరెడ్డి వర్మ జయంతి

శతాబ్దాల పర్యంతపు చావు డప్పుల వెనుక.. శవాల మోతల ముందు నడుస్తూ వచ్చిన దళితుల గమనం, గమ్యాన్ని మార్చిన ఘనత ఆయనది. అంటరాని కులాల ఆడబిడ్డలను దేవత పేరుతో గ్రామ పెద్దలకు బలిచ్చే దురాచారాన్ని ధిక్కరించిన ధీరత్వం ఆయన సొంతం. ప్లేగు, కలరా వంటి భయంకర అంటువ్యాధులతో భాగ్యనగర ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే స్వస్తి సేవాదళ్ సంస్థను ఏర్పాటుచేసి ప్రాణాలకు తెగించి అంటువ్యాధిగ్రస్తుల కాపాడేందుకు వైద్యసేవలందించిన సాహస ప్రవృత్తి ఆయనది. అంటువ్యాధులతో ఊరూపేరూ లేకుండా పోయిన అనాథ శవాలను గుర్తించి దహన సంస్కారాలు చేసిన మూర్తిమత్వం ఆయన సొంతం. ఆయనే భాగ్యరెడ్డి వర్మ.. ఈ పేరు దళిత చైతన్యానికి ప్రతీక. దళిత సామాజికవర్గం అభ్యున్నతికి అలుపెరుగని పోరాటం చేసిన కార్యశీలి.

Adi_Hindu_BhavanKoti                               హైదరాబాద్​ చాదర్​ఘాట్​లోని ఆదిహిందు భవన్​

హైదరాబాద్‌కు చెందిన మ్యాదరి వెంకయ్య, రంగమాంబ దంపతులకు రెండవ సంతానంగా 1888 మే 22న జన్మించారు బాగయ్య. కుటుంబ గురువు ఆయన పేరును భాగ్యరెడ్డిగా మార్చారు. హైదరాబాద్ నగర ప్రజల ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డుపెట్టి సేవచేసినందుకు అప్పటి జైన సేవాసంఘం వారు ఆయనకు వర్మ అనే బిరుదు ఇచ్చారు. చిన్నతనంలోనే భాగ్యరెడ్డి తండ్రి చనిపోవడంతో ఆయన తల్లి చిన్న కిరాణా కొట్టు నడిపిస్తూనే ఐదుగురు సంతానాన్ని పోషించింది. 18 ఏళ్ల వయసులో భాగ్యరెడ్డికి లక్ష్మీదేవితో వివాహమైంది. పెద్దగా విద్యాభ్యాసం లేదు. తెలుగు చదవడం, రాయడం మాత్రం వచ్చేది. గోవాకు చెందిన బారిస్టర్​ దోసా శాంటోస్ ఆయనకు ఆశ్రయమిచ్చి తన మొత్తం యాజమాన్యం, ఆరుగురు సేవకుల అజమాయిషీని భాగ్యరెడ్డి చేతుల్లో పెట్టాడు.

దురాచారాలపై ఉక్కుపిడికిలి
అంటరాని కులాలు అని ముద్రపడిన వారే ఈ దేశ మూలవాసులని చాటి చెప్పి, పంచములు అనే పేరును వ్యతిరేకించి వారిని ఆదిహిందువులుగా నిలిపిన వ్యక్తి భాగ్యరెడ్డివర్మ. దళితులకు విద్య ప్రాధాన్యత వివరించి వారికి ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటుచేశారు. దేవదాసి, బసివి, జోగిని వ్యవస్థ లాంటి దురాచారాలను ఎండగట్టారు. ఆయన కృషి ఫలితంగా ఇలాంటి దురాచారాలను ఆనాడే నిజాం ప్రభుత్వం నిషేధించింది. దక్షిణ భారతదేశమంతా పర్యటించి దళితులను కూడగట్టడంలో ఆయన పట్టుదల అనిర్వచనీయం. దేవాలయ ప్రవేశం వృథా ప్రయాసగా భావించి, సమానత్వాన్ని కాంక్షించిన బుద్ధుడి జయంతిని ఏటా జరపడం ద్వారా బౌద్ధం ప్రాధాన్యతను ఆనాడే గుర్తించారాయన.

బాలికావిద్యకు ప్రాధాన్యం
దళితవర్గాల వికాసానికి 1906లో జగన్ మిత్ర మండలిని స్థాపించి, 1913 నాటికి దానిని మన్యం సంఘంగా 1922 నాటికి ఆది సోషల్ సర్వీస్ లీగ్‌గా భాగ్యరెడ్డి వర్మ మార్పుచేశారు. బాలికలకు పత్యేక పాఠశాలల ప్రాధాన్యతను గుర్తించి, నెలకొల్పారు. 1910లోనే మొదటి బాలికల పాఠశాలను ప్రారంభించారాయన. 1933 నాటికి ఆ సంఖ్య 26 పాఠశాలలకు పెరిగింది. నేటికీ చాదర్ ఘాట్ రోడ్డులోని ఆది హిందూ భవన్‌లో ఆయన నెలకొల్పిన బాలికల పాఠశాలను ఆయన వారసులు మ్యాదరి భాగ్యగౌతమ్, మనవడు అజయ్ గౌతమ్ నడిపిస్తున్నారు. సికింద్రాబాద్ ఆదయ్యనగర్‌లో ఆదయ్య పేరుతో నేటికీ కొనసాగుతోన్న పాఠశాల భాగ్యరెడ్డివర్మ స్థాపించిందే. నిజాం కాలంలో ఉర్దూ పాఠశాలలే తప్ప తెలుగు బోధించలేని సమయంలో నిజాంను ఒప్పించి ఆయన స్థాపించిన 26 స్కూళ్లలో తెలుగు బోధనను ప్రవేశపెట్టారు.

హక్కులపై నినదించిన గొంతుక

1917లో బెజవాడలో ఆంధ్రదేశ మొదటి పంచమ సదస్సు భాగ్యరెడ్డి వర్మ అధ్యక్షతన జరిగింది. అదే సభలో పంచమ అనే శబ్దాన్ని భాగ్యరెడ్డి వర్మ ఖండించారు. వర్ణవ్యవస్థలో గానీ, వేదాలు, పురాణాల్లో గానీ పంచమ అనే పదం ఎక్కడా ప్రస్తావించలేదని సోదాహరణంగా వివరించారు. ఆ మరునాడే పంచమసదస్సు పేరును ఆది ఆంధ్రసదస్సుగా మార్చారు. స్కూళ్లలో అందరితో సమానమైన ప్రవేశ అవకాశాలు దళితులకు ఉండాలని, బావుల్లో నీళ్లు తోడుకునే హక్కు ఆది ఆంధ్రులకు ఇవ్వాలని, వారికి బంజరు భూములు పంచాలని, మున్సిపాలిటీలు, శాసనమండలి, జిల్లా, తాలూకా బోర్డుల్లో సభ్యులుగా నియమించాలని, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో సమానవాటా కల్పించాలని 18 డిమాండ్లను సదస్సు ఆమోదించింది.
దక్షిణ భారతదేశంలో నివసించే ప్రాచీన జాతులను పంచమ, పరయలుగా అగౌరవంగా పిలిచే పద్ధతికి స్వస్తి పలకాలని భాగ్యరెడ్డి వర్మ చేసిన కృషికి 1922 మార్చి 25న నాటి మద్రాసు ప్రభుత్వం దీనికి సంబంధించి జీవోనం.817 జారీచేసింది. 1931లో హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన జనాభా లెక్కల్లో వారిని ఆది హిందువులుగా నమోదుచేశారు. జాతీయ స్థాయిలో ఆ మహనీయుడు భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సాగించిన ఉద్యమానికి ఆయన సంఘీభావం తెలిపారు. భాగ్యరెడ్డివర్మ 1939 ఫిబ్రవరి 18న క్షయ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్​ లో కనుమూశారు. తెలంగాణ గడ్డపై పుట్టిన తొలి దళిత చైతన్య దీవిటి భాగ్యరెడ్డి వర్మ జీవితం ఆద్యంతం ఉద్యమ ప్రస్థానమే.. ఆ మహానేత కాంక్షించిన సమసమాజ నిర్మాణానికి కంకణబద్ధులు కావడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి

:: ఆర్ కే