Breaking News

తొందరపడి మొక్కజొన్న వేయొద్దు

తొందరపడి మొక్కజొన్న వేయొద్దు

సారథి న్యూస్, హైదరాబాద్: మొక్కజొన్న పంట సాగు, నిల్వలకు సంబంధించి దేశంలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం ఆ పంట సాగు ఏమాత్రం శ్రేయస్కరం కాదని వ్యవసాయ రంగ నిపుణులు, అధికారులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు వివరించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో దేశంలో మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర లభించే పరిస్థితులు లేకుండా పోయాయని అన్నారు. ‘ఎవరైనా ఎక్కడైనా పంటను అమ్ముకోవచ్చు.. కొనుక్కోవచ్చు’ అనే కేంద్ర కొత్త వ్యవసాయ చట్టాల విధానం పేదల రైతులకు శాపంగా మారిందన్నారు. పంటల సాగు, మార్కెటింగ్ అంశాలపై శనివారం ప్రగతిభవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ విఫణిలో అవసరాలకు పోను 28 కోట్ల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు నిల్వలు ఉన్నాయని, దేశంలో ప్రస్తుతం 2.42 కోట్ల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు మాత్రమే సరిపడతాయని వివరించారు. మొక్కజొన్నల మీద విధించే 50 శాతం దిగుమతి పన్ను 35 శాతం తగ్గించి కేవలం 15 శాతం పన్నుతో విదేశాలనుంచి మొక్కజొన్నలను దిగుమతి చేసుకునేందుకు కేంద్రం నిర్ణయించిందన్నారు. తద్వారా దేశంలోని రాష్ట్రంలోని మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర లభించక మొక్కజొన్న రైతు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉందన్నారు. బీహార్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కోళ్ల దాణా అతి తక్కువ రేటుకే దొరుకుతున్నందున, తెలంగాణలో పండిన మొక్కజొన్నలు కొనడానికి కోళ్ల వ్యాపారులు సుముఖంగా లేరని మంత్రి నిరంజన్​రెడ్డి సీఎం కేసీఆర్​కు వివరించారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో తెలంగాణ రైతాంగం యాసంగిలో మొక్కజొన్న సాగుచేస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని సూచించారు. సమావేశంలో మార్కెటింగ్ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, కార్యదర్శి స్మితా సభర్వాల్, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్థన్ రెడ్డి, సివిల్ సప్లయీస్ కమిషనర్ అనిల్ కుమార్, అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్ రావు, పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి పాల్గొన్నారు.