Breaking News

జగన్నాథ రథయాత్రకు బ్రేక్‌

న్యూఢిల్లీ: ఏటా ఒడిశాలో ఎంతో వైభవంగా జరిగే పూరీ జగన్నాథ రథ యాత్రకు ఈ సారి బ్రేక్‌ పడింది. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో యాత్రను నిలిపేయాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రథయాత్ర నిర్వహించడం కరెక్ట్‌ కాదని చీఫ్‌ జస్టిస్ ఎస్‌ ఏ బోబ్డే అన్నారు. ‘ఈ పరిస్థితుల్లో రథయాత్ర నిర్వహిస్తే పూరీ జగన్నాథుడు మనల్ని క్షమించరు” అని ఆయన కామెంట్‌ చేశారు. ప్రజారోగ్యం దృష్టిలో ఉంచుకుని రథయాత్రను నిలిపేస్తున్నట్లు అన్నారు. ఏర్పాట్లను కూడా నిలిపేయాలని ఆదేశించారు. ఒడిశాలోని ఎన్జీవో నిర్వాహకుడు వేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. జగన్నాథ యాత్రను ఒడిశాలో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. లెక్క ప్రకారం ఈనెల 23న రథయాత్ర జరగాల్సి ఉంది.