Breaking News

గాల్వన్​ ఫైట్​ ఎలా జరిగిందంటే..

న్యూఢిల్లీ: గాల్వాన్‌ గొడవ జరిగినప్పుడు మన వాళ్లు 100 మంది ఉంటే చైనావాళ్లు మాత్రం 300 నుంచి 350 మంది ఉన్నారట. అయినా కూడా మనవాళ్లు ఎక్కడా ధైర్యాన్ని కోల్పోలేదు. చైనా వాళ్లను ధీటుగా ఎదుర్కొన్నారు. అసలు ఏం జరిగిందో ఒక వ్యక్తి ఏఎన్‌ఐ వార్తా సంస్థకు ఈ విధంగా వివరించారు. తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ ప్రాంతంలో భారత భూభాగంలో పెట్రోలింగ్‌ పాయింట్‌ – 14 వద్ద చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ పీఎల్‌ఏ) టెంట్‌ వేసిందన్న సమాచారంతో భారత జవాన్లు రంగంలోకి దిగారు. ఈ నెల ప్రారంభంలోనే టెంట్‌ వేశారు. దీనిపై ఈ నెల 15న ఇండియన్‌ 3 ఇన్ఫాంటరీ సీనియర్‌‌ ఆఫీసర్స్‌ షైయోక్‌ అండ్‌ గాల్వాన్‌ నది దగ్గరలో చర్చలు జరిపారు.

ఆ తర్వాత చైనీస్‌ టెంట్‌ తీసేశారా? అనే విషయంపై చూసేందుకు 16 బీహార్‌‌ రెజిమెంట్‌ పెట్రోలింగ్‌ చేసింది. 10 నుంచి 12 మందితో సైనికులు టెంట్‌ వద్ద ఉండగా.. మిలటరీ ఆఫీసర్స్‌ మధ్య చర్చ జరిగిందని, టెంట్‌ తీసివేసి వెళ్లిపోవాలని మనవాళ్లు చెప్పగా.. చైనా దానికి అంగీకరించలేదు. పెట్రోలింగ్‌ టీం అదే విషయాన్ని ఆఫీసర్స్‌కు చెప్పింది. దీంతో 16 బీహార్‌‌‌ కమాండింగ్‌ ఆఫీసర్‌‌ కల్నల్‌ సంతోష్‌ బాబు నేతృత్వంలోని మన సైనికులు వెళ్లి ఇండియన్‌ భూభాగం అని, ఈ టెరిటరీని వదిలి తమ భూభాగానికి వెళ్లాలని వార్నింగ్‌ ఇచ్చారు. కాగా.. ఇండియాకు చెందిన ఫస్ట్‌ పెట్రోలింగ్‌ టీమ్‌ తిరిగి వచ్చి మళ్లీ మన సైనికులు వెళ్లే సమయానికి చైనీస్‌ ట్రూప్స్‌ దాదాపు 300 నుంచి 350 వరకు పోగయ్యారు. అప్పటికే మన వాళ్లపై దాడి చేయాలని రెడీగా ఉన్న చైనా ఆర్మీ రాళ్లు, ఇనుప రాడ్లతో దాడికి దిగారు.

చైనీయులు దాడి చేసిన వెంటనే 16 బీహార్‌‌ కమాండింగ్‌ ఆఫీసర్‌‌, హవిల్దార్‌‌ పళనీ కింద పడిపోయారు. దీంతో కంట్రోల్‌ కోల్పోయిన మన వాళ్లు చైనా వాళ్లపై దాడికి దిగారు. దాదాపు మూడుగంటల పాటు ఈ గొడవ జరిగింది. ఈ ఘటనలో చాలా మంది చైనా వాళ్లు చనిపోయారు. మరుసటి రోజు పొద్దున సంఘటన స్థలానికి వెళ్లిన మన వాళ్లే చైనా సైనికుల శవాలను వాళ్ల దేశానికి అప్పగించారని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక వ్యక్తి చెప్పారు. మన సైనికులు 100 మంది మాత్రమే ఉన్నారని, వాళ్లు వైపు నుంచి 300 నుంచి 350 మంది వచ్చారని అయినా కూడా బీహార్‌‌ రెజిమెంట్‌కు చెందిన మన సైనికులు ధైర్యంగా పోరాడారని కొనియాడారు.