![గణపతి లొంగుబాటు కల్పిత కథ](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/ganapathi_pic.jpg?fit=677%2C469&ssl=1)
హైదరాబాద్: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగుబాటుపై మూడు నాలుగు రోజులుగా మీడియాలో వస్తున్న కథనాలపై ఆ పార్టీ కేంద్ర కమిటీ స్పందించింది. అవన్నీ కల్పిత కథలేనని కొట్టిపారేసింది. ఈ మేరకు అధికార ప్రతినిధి అభయ్పేరుతో లేఖను విడుదల చేసింది. ‘గణపతి సరెండర్ ఒక హైటెన్షన్ కల్పిత కథ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న నాటకం, తెలంగాణ, చత్తీస్గఢ్ ఇంటలిజెన్స్ అధికారుల కట్టు కథలతో పాటు, పోలీసులు అల్లిన నాటకం. మీడియాను పావుగా వాడుకున్నారు. కామ్రేడ్ గణపతి చిన్న చిన్న అనారోగ్య కారణాల రీత్యా స్వచ్ఛందంగా బాధ్యతల నుంచి తప్పుకున్నారు, కేంద్ర కమిటీ బాధ్యతల నుంచి తప్పుకున్నా ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నారు, సిద్ధాంత పరంగా, రాజకీయంగా మా నాయకత్వం దృఢంగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాం. మా నాయకత్వపు ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇలాంటి కట్టుకథలు అల్లుతున్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైన మా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం.’ అని పేర్కొన్నారు. కాగా, అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి పోలీసులకు లొంగిపోతారని పెద్దఎత్తున ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.