Breaking News

కొత్త రెవెన్యూ చట్టం.. కీలక అంశాలు ఇవే

కొత్త రెవెన్యూ బిల్లు.. కీలక అంశాలు ఇవే

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో రెవెన్యూ బిల్లులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు బుధవారం ప్రవేశపెట్టారు. వీటిలో ‘భూమి హక్కులు, పాస్‌పుస్తకాల చట్టం- 2020’, ‘గ్రామరెవెన్యూ అధికారుల రద్దు చట్టం- 2020’ ఉన్నాయి. కేంద్ర, రాష్ట్రాల భూములకు చట్టంలోని అంశాలు వర్తించవని ప్రభుత్వం తెలిపింది. ‘భూ లావాదేవీలకు వెబ్‌సైట్‌ ద్వారా స్లాట్‌ కోసం దరఖాస్తు చేయాలి. సబ్‌రిజిస్ట్రార్‌ ఇచ్చిన సమయానికి పత్రాలు ఇచ్చి సేవలు పొందాలి. భూములను మార్ట్‌గేజ్ చేస్తే ధరణి వెబ్‌సైట్‌లో నమోదు చేయించాలి. పూర్తిగా ఎలక్ట్రానిక్‌ విధానంలో భూరికార్డుల నిర్వహణ ఉంటుంది. భూమి హక్కుపత్రం, పట్టాదారు పాస్‌పుస్తకం ఏకీకృతం చేస్తాం. భూహక్కుల రికార్డుల్లో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్‌ చర్యలు ఉంటాయి. ధరణి పోర్టల్‌లో ఆన్‌లైన్‌ ద్వారా భూయాజమాన్య హక్కుల బదిలీ ఉంటుంది.’అని స్పష్టం చేశారు.
బిల్లులోని ముఖ్యాంశాలు
–నిబంధనలకు విరుద్ధంగా భూమి హక్కుల రికార్డుల అక్రమాలకు పాల్పడితే సంబంధిత అధికారిపై క్రిమినల్ చర్యలతో పాటు సర్వీసు నుంచి తొలగింపు, బర్తరఫ్, శిక్ష పడుతుంది.
– రైతులకు పట్టాదారు పాసుపుస్తకం ప్రతి లేకుండా ఎలక్ట్రానిక్ విధానంలో రుణాలు.
–గ్రామ రెవెన్యూ అధికారుల పదవులు రద్దు
– ధరణి పోర్టల్​లో ఆన్​లైన్​ ద్వారా భూ యాజమాన్య హక్కుల బదిలీ
– పూర్తిగా ఎలక్ట్రానిక్ విధానంలో భూ రికార్డుల నిర్వహణ.
– వీఆర్వోగా పనిచేస్తున్న వారి సేవలను పరిపాలన అవసరాలను బట్టి అదే స్థాయిలో ఇతర ప్రభుత్వశాఖలోకి బదిలీచేస్తారు.
– కొత్తచట్టం వ్యవసాయ యోగ్యమైన భూమి కోసం మాత్రమే వర్తిస్తుంది.
– పట్టాదారు పాస్ పుస్తకాన్ని హక్కు పత్రముగా పరిగణిస్తారు.
– తహసీల్దార్ కు సబ్ రిజిస్ట్రార్ కు ఉండే అధికారాల అప్పగింత
– భూ వివాదాల పరిష్కారాల కోసం ఒక్కరూ లేదా అంతకన్నా ఎక్కువ సభ్యులతో ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు.
– కోర్ బ్యాంకింగ్ సిస్టం. ప్రతి గ్రామంలోని భూముల హక్కుల రికార్డును డిజిటల్ స్టోరేజీ చేయాలి.
– కొత్త పట్టాదారు పుస్తకానికి హక్కుల రికార్డుగా పరిగణిస్తారు. ఆ రికార్డులో పట్టాదారు పేర్లు, సర్వే నంబర్లు, విస్తీర్ణం తదితర వివరాలు ఉంటాయి.
– ఈ చట్టం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భూములకు వర్తించదు.
– పాయిగా – జాగీరు- సంస్థానాలు – మక్తా- గ్రామ అగ్రహారం – ఉహ్మ్లి- ముకాసా సహా అన్ని రకాల భూముల యాజమాన్యం ఈ చట్టం ప్రకారం బదిలీ చేయరాదు.
– జాగీరు భూములను ప్రభుత్వ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలి.
– ఏ రకమైన రిజిస్టేషన్ కోసమైనా ప్రభుత్వం నిర్దేశించిన వెబ్ సైట్స్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలి.
– రిజిస్టేషన్ సమయంలో పాస్ పుస్తకం బదిలీ దస్తావేజులు రిజిస్ట్రార్ సమక్షంలో ఇవ్వాలి.
– మ్యుటేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి.
– వ్యవసాయ భూముల అమ్మకం కొనుగోలు మ్యుటేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే హక్కుల రికార్డు పూర్తిచేసి కొన్నవారికి వెంటనే బదిలీ చేయాలి.
– ఉమ్మడి ఒప్పందం ఉంటేనే చట్టబద్ధమైన వారసుల మధ్య భూవిభజన చేయాలి.
– మోసపూరితంగా ప్రభుత్వ భూములకు పట్టాదారు పాస్ పుస్తకాన్ని జారీచేస్తే రద్దు చేసే అధికారం కలెక్టర్‌కు ఉంది.
– జారీచేసిన చేసిన తహసీల్దార్ బర్తరఫ్, క్రిమినల్ కేసు నమోదుచేస్తారు. తిరిగి భూములు స్వాధీనం చేసుకుంటారు.
– కొత్తబిల్లు ప్రకారం హక్కుల రికార్డుల్లో సవరణలు చేస్తే ప్రభుత్వం, ప్రభుత్వ అధికారిపై ఎలాంటి దావా వేయరాదు.
–ఇప్పటి వరకు ఎలాంటి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీచేయని భూములకు పాస్ పుస్తకాలు జారీచేసే అధికారం తహసీల్దార్ కు ఉంది.
– డిజిటల్ రికార్డుల ఆధారంగానే వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలి. 
– రుణాల మంజూరు కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్ పుస్తకాలను బ్యాంకుల్లో పెట్టుకోరాదు.
– ఈ చట్టం సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 కింద విచారణకు అర్హత ఉంది.
– ఈ బిల్లు చట్టరూపం దాల్చగానే పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం 1971 రద్దు అవుతుంది.
– రికార్డులను అక్రమంగా దిద్దడం, మోసపూరిత ఉత్తర్వులు జారీచేస్తే అధికారులు – ఉద్యోగులపై క్రిమినల్ చర్యలు, సర్వీస్ నుంచి తొలగింపు బర్తరఫ్ చేస్తారు.
– 1971 యాక్ట్ రద్దు అయిన నేపథ్యంలో పెండింగ్ లో ఉన్న ఫైల్స్, కేసులన్నీ కొత్తగా ఏర్పాటుచేసే ప్రత్యేక ట్రిబ్యునల్ కు బదిలీచేస్తారు.
– విచారణ తరువాత ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఫైనల్
– కొత్త చట్టం ఏర్పాటైన తర్వాత రూల్స్ రూపొందించాలి.