![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/santhosh-final.jpg?fit=402%2C463&ssl=1)
సారథి న్యూస్, సూర్యాపేట: భారత్ సరిహద్దుల్లో చైనా దొంగ దెబ్బకు అమరుడైన కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహం బుధవారం హైదరాబాద్లోని హకీంపేట విమానాశ్రయానికి చేరింది. వీరజవాన్ పార్థివదేహానికి తెలంగాణ గవర్నర్ తమిళిసైతో మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. సంతోష్బాబు భార్య, పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. ప్రత్యేకంగా అంబులెన్స్లో సంతోష్బాబు పార్థివదేహాన్ని సూర్యాపేటకు తరలించారు. తొలుత హైదరాబాద్లోనే అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులు కోరగా.. తాము స్వస్థలంలోనే నిర్వహించుకుంటామని ఆయన తల్లిదండ్రులు చెప్పడంతో గురువారం ఉదయం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సూర్యాపేట నుంచి స్వస్థలమైన కేసారం వరకు అంతిమయాత్ర నిర్వహించనున్నారు.