Breaking News

కరోనా ఉగ్రరూపం

జెనీవా: కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఆందోళనకర స్థాయిలో ఉన్నదని వరల్డ్‌ హెల్త్ ఆర్గనైజేషన్‌ హెచ్చరించింది. ఐరోపా దేశాల్లో కాస్త తగ్గుముఖం పట్టినా అమెరికాతోపాటు దక్షిణాసియా దేశాల్లో కేసులు సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాతోపాటు ఐరోపాలోని పదిదేశాల్లో గత 9 రోజుల్లో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఆఫ్రికా దేశాల్లోనూ వైరస్‌ రోజురోజుకి పెరుగుతున్నదని టెడ్రోస్‌ పేర్కొన్నారు. చాలా దేశాల్లో కేసులు వెయ్యికంటే తక్కువగానే ఉన్నప్పటికీ రోజురోజుకు కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా కొన్ని వర్గాలు చేస్తున్న ఆందోళనలపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనలతో కరోనా విజృంభించే అవకాశం ఉందని హెచ్చరించారు. జాతి సమానత్వం కోసం చేసే పోరాటానికి డబ్ల్యూహెచ్‌వో ఎప్పుడు మద్దతు పలుకుతుందని, కానీ నిబంధనలు పాటిస్తూ నిరసన తెలియజేయాలని సూచించారు. వీలైనంత వరకు పక్కవారి నుంచి కనీసం ఒక మీటరు దూరం పాటించాలని, చేతులను శుభ్రం చేసుకుంటూ.. దగ్గు వస్తే కవర్‌‌ చేసుకోవాలని సూచించారు. అనారోగ్యంతో ఉన్నవారు ఆందోళనలో పాల్గొనకపోవడమే ఉత్తమమని సూచించారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 71,93,476 మందికి కరోనా సోకగా.. వారిలో 4,08,614 మంది చనిపోయారు