![ఆంధ్రప్రదేశ్ లో లంబోర్గిని కార్ల యూనిట్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/10/lambo-final.jpg?fit=677%2C352&ssl=1)
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కు మరో ప్రతిష్టాత్మక వాహనాల తయారీ యూనిట్ రానుంది. ప్రముఖ స్పోర్ట్స్ వెహికల్ బ్రాండ్ లంబోర్గిని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ను రాష్ట్రంలో ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చింది. గోల్ఫ్, ఇతర క్రీడల్లో వినియోగించే ప్రీమియం బ్రాండ్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి పుణెకు చెందిన కైనటిక్ గ్రీన్ సంస్థ ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రంలో సుమారు రూ.1,750 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్, బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లు, చార్జింగ్ స్వాపింగ్, ఆర్ అండ్ డీ యూనిట్లు ఏర్పాటు చేయడానికి కైనటిక్ గ్రీన్ బోర్డు ఆమోదం తెలిపింది. ఈమేరకు కైనటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఫౌండర్ సీఈవో సులజ్జా ఫిరోడియా మొత్వాని, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డికి లేఖ రాశారు. కాగా, దేశంలో లంబోర్గిని బ్రాండ్ ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసి విక్రయించేందుకు గాను కైనటిక్ గ్రీన్ సంస్థతో 2018లో ఒప్పందం చేసుకుంది. వచ్చే పదేళ్లలో కేవలం రాష్ట్రంలోనే 5 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయిస్తామని.. దీనివల్ల కాలుష్యం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.