Breaking News

ఎస్సై గొప్ప మనస్సు

ఎస్సై గొప్ప మనస్సు

సారథి న్యూస్, హుస్నాబాద్: దివ్యాంగులైన ఇద్దరు దంపతులకు ఓ పోలీసు అధికారి తన సొంతఖర్చులతో మరుదొడ్లను కట్టించి మానవతా హృదయం చాటుకున్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూర్ గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన బొజ్జ సంతోష, భర్త కొమురయ్య దంపతులు దివ్యాంగులు. వారి ఆలాన పాలన చూసుకోవడానికి సంతానం కూడా లేకపోవడంతో ప్రతిరోజు కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆ దంపతులు పడుతున్న అవస్థలు అన్నీఇన్ని కావు. వారి ఇబ్బందులను స్వయంగా చూసి చలించిపోయిన అక్కన్నపేట ఎస్సై కొత్తపల్లి రవి తన సొంత ఖర్చుతో మరుగుదొడ్లను నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం నిర్మాణం పూర్తిచేయించి ఆ దంపతుల చేతులతోనే హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ ప్రారంభోత్సవం చేయించారు. నిరుపేద దంపతులను గుర్తించి వారికి ఎస్సై సహాయం చేయడంపై పలువురు గ్రామస్తులు, ఏసీపీ అభినందించారు. అనంతరం ఆ దంపతులకు ఏసీపీ బియ్యం, నిత్యావసర వస్తువులతో పాటు నూతన వస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ అశోక్ రెడ్డి, సెక్రటరీ మోహన్ నాయక్, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

దివ్యాంగులైన పేద దంపతులకు వస్త్రాలు అందజేస్తున్న ఏసీపీ మహేందర్​, ఎస్సై తదితరులు