Breaking News

ఇవి నానబెట్టి తింటే ఆరోగ్యం

ఇవి నానబెట్టి తింటేనే ఆరోగ్యం

కరోనా విజృంభిస్తున్న వేళ ప్రతిఒక్కరూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీటిని తీసుకుంటే మరింత శక్తి పెరుగుతుందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. కొన్ని పదార్థాలను మామూలుగా తినేకంటే.. నానబెట్టి క్రమం తప్పకుండా ఎన్నో ఆరోగ్య లాభాలు ఉంటాయి. బరువు తగ్గడంతో పాటు మరెన్నో ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో తెలుసుకుని ట్రై చేసి చూడండి.
మెంతులు
రెండు చెంచాల మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినాలి. ఆ నీటిని తాగాలి. రోజూ ఇలా చేయడం వల్ల కీళ్లనొప్పులు తగ్గుతాయి. వీటిలో పీచు అధికంగా ఉంటుంది. ఇది పేగులను శుభ్రపరచి మలబద్ధకం లేకుండా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. నెలసరి సమయంలో వచ్చే నొప్పులూ తగ్గుతాయి.
అవిసె గింజలు
వీటిలో పీచు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌ ‘బీ’, ఇనుము, మాంసకృత్తులు, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ చెంచా నానబెట్టిన గింజలను తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు రోగనిరోధక శక్తీ పెరుగుతుంది. శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది.
అంజీరా
ఇది పోషకాల గని. దీంట్లో ఎ, బి విటమిన్లు, క్యాల్షియం, ఇనుము, మాంగనీస్‌, సోడియం, పొటాషియం, పీచు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్‌తో పోరాడి అనారోగ్యాలు దరిచేరకుండా చేస్తాయి. మెదడు పనితీరును చురుగ్గా ఉంచుతాయి. అధిక రక్తపోటును తగ్గిస్తాయి.
బాదం
రోజూ నానబెట్టిన అయిదారు బాదం పప్పును తింటే మెదడు చురుగ్గా ఉంటుంది. వీటిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ సమస్య తగ్గడంతోపాటు బరువూ నియంత్రణలో ఉంటుంది.
ఎండుద్రాక్ష
వీటిలో ఇనుము, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. కిస్మిస్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా మారడంతో పాటు కాంతివంతంగా మెరుస్తుంది. రోజూ రాత్రిపూట పది, పన్నెండు ఎండు ద్రాక్షలను నీటిలో నానబెట్టి ఉదయం తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇనుము సమృద్ధిగా అందుతుంది.