Breaking News

ఆరోగ్యసిబ్బందికి పూర్తి వేతనం

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న వైద్యులు, వైద్యసిబ్బందికి పూర్తివేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆ మేరకు అన్ని రాష్ట్రప్రభుత్వాలను, కేంద్రపాలితప్రాంతాలను ఆదేశించాలని కేంద్రానికి సూచించింది. హెల్త్​ వర్కర్లకు వసతి కూడా కల్పించాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్​ అశోక్​భూషన్​ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. కరోనా వ్యాధిగ్రస్థులకు వైద్యం అందించిన డాక్టర్లు, హెల్త్‌ వర్కర్లను కచ్చితంగా ఏడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచే విధంగా నిబంధనలు తీసుకురావాలని సూచించింది. రాష్ట్రాలు ఈ నిబంధనలు పాటించకపోతే డిజాస్టర్‌‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ అండ్‌ సెక్షన్‌ 188 కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కొన్నిరాష్ట్రాల్లో వైద్యులకు వేతనాలు ఇవ్వడం లేదని.. ఢిల్లీలో మూడు నెలలుగా వేతనాలు లేక డాక్టర్లు, ఆశావర్కర్లు ఆందోళన చేశారని కోర్టు గుర్తుచేసింది. దానిపై వెంటనే చర్యలు చేపట్టాలని లేని పక్షంలో కోర్టు జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పింది. వైద్యులు, వైద్యసిబ్బంది కరోనా యుద్ధంలో పోరాడుతున్న ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ అని , అలాంటి వారిని అసంతృప్తికి గురిచేయడం సరికాదని కోర్టు గతంలోనూ పేర్కొన్నది.