Breaking News

ఆన్​లైన్​ న్యూస్ పోర్టళ్లపై నియంత్రణ

ఆన్​లైన్​ న్యూస్ పోర్టళ్లపై నియంత్రణ

ఢిల్లీ: నెట్ ఫ్లిక్స్ వంటి ఆన్ లైన్ న్యూస్ పోర్టళ్లు, కంటెంట్ ప్రొవైడర్లను సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ పరిధిలోకి తీసుకువస్తూ బుధవారం కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం డిజిటల్ కంటెంట్ ను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టంగానీ, స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, న్యూస్ చానళ్లు, ప్రింట్ మీడియా, సినిమాలు న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్(ఎన్​బీఏ), ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ), సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్ సీ) వంటి సంస్థల కంట్రోల్ లో ఉన్నాయి.
ఓటీటీ ప్లాట్ ఫాంల్లోని న్యూస్ పోర్టల్స్, హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి స్ట్రీమింగ్ సర్వీసులను క్లియరెన్స్ పై ఆందోళన చెందకుండా కంటెంట్ ను రిలీజ్ చేయడానికి వీలుదొరికిందని, వీటిని ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ క్రమబద్ధీకరించాలని గతనెలలో పిటిషన్ దాఖలైంది. విచారించిన సుప్రీంకోర్టు దీనిపై కేంద్రప్రభుత్వం స్పందన కోరింది. ఈ మేరకు కేంద్రానికి, సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ, ఇంటర్​నెట్​ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీచేసింది. దీంతో డిజిటల్ మీడియాను ఎలాగైనా నియంత్రించాల్సిన అవసరం ఉందని, మంత్రిత్వశాఖ కోర్టుకు తెలిపింది. అందులో భాగంగానే కేంద్రం ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. 2019లో ఈ అంశంపై సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జావదేకర్ మాట్లాడుతూ మీడియా స్వేచ్ఛను హరించే ఏ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోదని, ప్రింట్, ఎలక్ర్టానిక్, సినిమాలకు ఉన్నట్లుగానే ఓటీటీలపై నియంత్రణ ఉండాలని వెల్లడించారు.