Breaking News

అయోధ్యకు.. ముస్లింకే మొదటి ఆహ్వానం

అయోధ్యకు.. ముస్లింకే మొదటి ఆహ్వానం

న్యూఢిల్లీ: అయోధ్య రామమందిర నిర్మాణం భూమి పూజకు రావాలని బాబ్రీమసీదు కోసం న్యాయపోరాటం చేసిన ఇక్బాల్ అన్సారీకి సోమవారం తొలి ఆహ్వానపత్రిక అందింది. అయోధ్య రామజన్మభూమి వివాదంపై ముస్లింల తరఫున బలంగా గళం వినిపించిన వారిలో అన్సారీ ఒకరు. తనను ఆహ్వానించడంపై అన్సారీ హర్షం వ్యక్తంచేశారు. ‘నాకు తొలి ఆహ్వానం అందాలన్నది సాక్షాత్తూ శ్రీరాముడి ఆకాంక్ష అని భావిస్తున్నాను. అందుకే దీన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను..’ అని అన్సారీ అన్నారు.
180 మందికి మాత్రమే ఆహ్వానం
ఈనెల 5న ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. ప్రధాని నరేంద్రమోడీ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. కాషాయం రంగు ఆహ్వానపత్రంలో ప్రధాని నరేంద్రమోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌ తదితర అతిథుల పేర్లు ఉన్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేవలం 180 మందికి మాత్రమే భూమి పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. అతిథుల జాబితాలో తొలుత 200 మందికిపైగా చోటు కల్పించినప్పటికీ.. మళ్లీ దీన్ని తగ్గించి కేవలం 170 నుంచి 180 మందిని మాత్రమే ఆహ్వానిస్తున్నట్టు సమాచారం.