Breaking News

అన్‌లాక్‌-2: కేంద్రం కీలక గైడ్​లైన్స్​

అన్‌లాక్‌-2: కేంద్రం కీలక గైడ్​లైన్స్​

ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ కంటైన్‌మెంట్‌ జోన్లలో కేంద్రం లాక్‌డౌన్‌ పొడిగించింది. ఈ మేరకు సోమవారం రాత్రి అన్‌లాక్‌ -2 విధివిధానాలను ప్రకటించింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో జులై 31వరరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర శిక్షణా సంస్థలకు జులై 15 నుంచి కార్యకలాపాలకు అవకాశం కల్పించింది. అలాగే, హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకే అంతర్జాతీయ ప్రయాణికులకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. మెట్రో రైళ్లు, థియేటర్లు, జిమ్‌లు, స్విమ్మింగ్‌ పూల్స్‌పై నిషేధం కొనసాగనుంది. సామాజిక, రాజకీయ, మతపరమైన కార్యకలాపాలపైనా నిషేధం కొనసాగుతుందని స్పష్టంచేసింది. బుధవారం నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి. రాత్రిపూట కర్ఫ్యూని రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5గంటలకు సడలించింది.
కీలక మార్గదర్శకాలివే..

  • అంతర్రాష్ట్ర, అంతర్గత ప్రయాణికుల సర్వీసులు కొనసాగుతాయి.
  • విదేశాల్లో చిక్కుకున్న వారిని తీసుకొచ్చేందుకు అవకాశం.
  • బయట తిరిగేవారంతా ముఖానికి మాస్క్‌లు తప్పనిసరిగా కట్టుకోవాలి.
  • ప్రయాణ సమయం మొత్తం ప్రయాణికులు మాస్క్‌ ధరించాల్సిందే.
  • బయట ప్రదేశాల్లో ప్రతిచోటా ఆరు అడుగుల దూరాన్ని పాటించాలి.
  • దుకాణదారులు కేంద్ర మార్గదర్శకాల మేరకు ఏర్పాట్లు చేయాలి.
  • భారీ సంఖ్యలో జనం గుమిగూడంపై నిషేధం.
  • వివాహ, వివాహ సంబంధ కార్యక్రమాలకు 50మందికే అనుమతి.
  • అంత్యక్రియల్లో పాల్గొనేందుకు 20మందికి మాత్రమే అనుమతి.
  • బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నిషేధం, ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు
  • బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, పొగాకు ఉత్పత్తులు తీసుకోవడం నిషేధం
  • అవకాశం మేరకు ఇంటి నుంచి పనిచేసేందుకే ప్రయత్నించాలని కేంద్రం సూచన.
  • పని ప్రదేశాలు, ఎక్కువమంది సంచరించే ప్రాంతాలను నిత్యం శానిటైజ్‌ చేయాలి.
  • షిఫ్ట్‌ మారే సందర్భంలో భౌతికదూరం పాటించేందుకు చర్యలు తీసుకోవాలి.
  • కేంద్రం, రాష్ట్రాల విధివిధానాలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు, జరిమానా
  • తప్పుడు సమాచారం ఇచ్చినా.. శిక్షకు గురికావాల్సి ఉంటుంది
  • కేంద్ర, రాష్ట్ర విధివిధానాలను అన్ని కంపెనీలు, సంస్థలు విధిగా పాటించాల్సిందే.
  • అలసత్వం ప్రదర్శించిన వారిపై ఐపీసీ ప్రకారం కఠిన చర్యలు తీసుకొనేందుకు శిక్షార్హులు.