![అధికారుల బెదిరింపులు మానుకోవాలి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/12/vjd-2-1.jpg?fit=677%2C350&ssl=1)
సారథి న్యూస్, వెంకటాపురం: ఏజెన్సీలో భుక్తి కోసం, న్యాయబద్ధంగా శాంతిభద్రతలకు ఆటంకం కలిగించకుండా కరోనా నియమ నిబంధనలను పాటిస్తూ నిరసన వ్యక్తంచేస్తున్న ఆదివాసీలను దీక్ష విరమించాలని బెదిరింపులకు పాల్పడడం సరికాదని ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా కార్యదర్శి పూనేం చంటి అన్నారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ములుగు జిల్లాలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు శనివారం ఐదవ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తూ గిరిజనులకు రక్షణ కల్పించాల్సిన అధికారులు భరోసా ఇచ్చామనే పేరుతో దీక్షలు ఎందుకు విరమించడం లేదని మందలించడం సరికాదన్నారు. ప్రశ్నించే గొంతుకలను భయాందోళనకు గురిచేసి.. బెదిరింపులకు పాల్పడడం మానుకోవాలని సూచించారు. ఆదివాసీలను మోసం చేసే మాయమాటలకు బలికాకూడదన్నారు. కార్యక్రమంలో నాయకులు పాయం కృష్ణ, పూనెమ్ ప్రతాప్, ఆనంద్ గోపాల్ పాల్గొన్నారు.