Breaking News

అద్భుతంగా ‘గుట్ట’ అభివృద్ధి

అద్భుతంగా గుట్ట అభివృద్ధి

  • ఆధ్యాత్మికత, ఆహ్లాదం ఉట్టిపడేలా యాదాద్రి అభివృద్ధి
  • అత్యంత సుందరంగా ఉండేలా ఆలయ నిర్మాణపనులు
  • పనుల కోసం మూడు వారాల్లో రూ.75 కోట్లు విడుదల
  • యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్న సీఎం కె.చంద్రశేఖర్​రావు

సారథి న్యూస్, యాదాద్రి భువనగిరి: ఆధ్యాత్మికత, ఆహ్లాదం ఉట్టిపడేలా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణం రూపుదిద్దుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. రాబోయే కాలంలో అనేక ఏళ్లపాటు నిలవాల్సిన గొప్ప నిర్మాణం కావునా ఎక్కడా తొందరపాటు లేకుండా సంప్రదాయాలు, ఆగమశాస్త్ర నియమాలు పాటిస్తూ నిర్మాణం జరగాలని ఆదేశించారు. స్వామివారికి సేవలు, పూజలు చేసే విషయంలో భక్తులకు సౌకర్యాలు కల్పించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఆలయ నిర్మాణ పనులు అత్యంత సుందరంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆదివారం మధ్యాహ్నం యాదాద్రి ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ లక్ష్మీ నరసింహాస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. సుమారు 6 గంటలపాటు ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు.

యాదాద్రిలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్​

మణిహారంలా రింగు రోడ్డు
యాద్రాద్రి ఆలయానికి రింగు రోడ్డు సుందరీకరణ ఒక మణిహారంలా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. పచ్చని చెట్లు, వీధిలైట్లు, సైక్లింగ్ ట్రాక్ లతో రింగ్ రోడ్డును అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్​అధికారులను ఆదేశించారు. ఎంతమంది భక్తులు వచ్చినా వారికి సౌకర్యాలు కల్పించే విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా అన్ని నిర్మాణాలు ఉండాలని సీఎం సూచించారు. ఆలయానికి ఆనుకుని ఉన్న గండిపేట చెరువును ప్రతి రెండు నెలలకు ఒకసారి కాళేశ్వరం జలాలతో నింపాలని ఆదేశించారు. ఆలయం పరిసరాలు, టెంపుల్ సిటీ నిర్మాణం అద్భుతమైన పచ్చదనంతో నిండి ఉండాలని, ఇందుకోసం చెట్లను ఎక్కువగా పెంచాలన్నారు. స్పెషల్ ఆర్కిటెక్ట్ లను పిలిపించి గండిపేట చెరువు ప్రాంతాన్ని అందమైన స్పాట్ గా తీర్చిదిద్దాలని సీఎం కోరారు.

ఆలయ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్​

క్వార్టర్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి
యాదాద్రి టెంపుల్ సిటీలో 365 క్వార్టర్ల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. మరో 200 ఎకరాల్లో కాటేజీల నిర్మాణానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. కల్యాణకట్ట, బస్టాండ్, పుష్కరిణి రెయిలింగ్, రోడ్ల పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సకాలంలో పనులు చేయని కాంట్రాక్టర్లను తొలగించాలని ఆర్అండ్ బీ ఈఎన్సీకి సూచించారు. బస్టాండ్ నుంచి గుడి వరకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయ రాజగోపురం, ప్రధాన ద్వారాలకు బంగారు తాపడం వంటి పనులు చేసేందుకు పెంబర్తి నుంచి నిపుణులైన స్వర్ణకారులను పిలిపించాలని ఆదేశించారు. యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల కోసం మూడు వారాల్లో రూ.75 కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఫోన్ లో ఆదేశించారు. సత్యనారాయణ స్వామి వ్రతాలకు యాదాద్రి ప్రసిద్ధి అని, ఒకేసారి నాలుగువేల మంది వ్రతం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆలయం, టెంపుల్ సిటీ నుంచి డ్రైనేజీ నీళ్లను బయటకు పంపడానికి ప్రత్యేక నిర్మాణాలు చేయాలని కోరారు. ఐదువేల కార్లు, 10 వేల బైకుల కోసం పార్కింగ్ ను సిద్ధం చేయాలని సీఎం సూచించారు.
హరిత గెస్ట్ హౌస్ లో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి జి.జగదీశ్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ప్రభుత్వ విప్ గొంగిడి సునితా మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, టూరిజం డెవలప్​మెంట్​ బోర్డు చైర్మన్ భూపతిరెడ్డి, కలెక్టర్ అనితా రామచంద్రన్, సీఎంవో అధికారి భూపాల్ రెడ్డి, వైటీడీఏ స్పెషలాఫీసర్ కిషన్ రావు, ఆలయ ఈవో గీత, ఆర్ అండ్ బీఈఎన్​సీలు గణపతిరెడ్డి, రవీందర్ రావు, ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి, స్థపతి డాక్టర్ వేలు ఉన్నారు.

ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్న సీఎం కె.చంద్రశేఖర్​రావు