Breaking News

అక్టోబర్ 17 నుంచి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

విజయవాడ: అక్టోబర్ 17 నుంచి ఇంద్రకీలాద్రిపై శ్రీ శార్వరి నామ సంవత్సర దసరా మహోత్సవాలు ప్రారంభంకానున్నాయి. 9 రోజుల పాటు పది అలంకారాలలో దుర్గమ్మ దర్శనమిస్తారు. కోవిడ్ నేపథ్యంలో టైం స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే దసరాలో అమ్మవారి దర్శనానికి అనుమతించే అవకాశం ఉంది. రోజుకు 9 వేలా లేక సంఖ్య పెంచాలా అన్న దానిపై అధికారుల తర్జనబర్జనలో ఉన్నారు. గత ఏడాది దసరాలో రోజుకు లక్షపైనే అమ్మవారిని భక్తులు దర్శనం చేసుకున్నారు. ఈ ఏడాది కోవిడ్ దృష్ట్యా దుర్గగుడి అధికారులు ఆంక్షలను మరింత కఠినతరం చేయనున్నారు.

అమ్మవారి అలంకార వివరాలు
అక్టోబర్ 17వ తేదీన తొలిరోజు శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి, 18 న శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి, 19న శ్రీ గాయత్రీ దేవి, 20న శ్రీ అన్నపూర్ణాదేవి, 21 మూలానక్షత్రం రోజున శ్రీ సరస్వతీ దేవి, 22న శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి, 23న శ్రీ మహాలక్ష్మీ దేవి, 24న శ్రీ దుర్గాదేవి, శ్రీ మహిషా సురమర్ధనీ దేవిగా రెండు అలంకారాలలో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. 25న శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. అదేరోజు సాయంత్రం కృష్ణానదిలో దుర్గామల్లేశ్వరస్వామి వార్ల తెప్పోత్సవం నిర్వహిచారు. దీంతో దసరా ఉత్సవాలు ముగుస్తాయి.