న్యూఢిల్లీ: ఇండియా – చైనా బార్డర్లో నెలకొన్న పరిస్థితులపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి కేంద్ర హోం మంత్రి అమిత్ షా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఓ జవాన్ తండ్రి రాహుల్ గాంధీకి సూచనలు చేస్తున్న వీడియోను ట్వీట్ చేసి రాహుల్కు సమాధానం చెప్పారు. ‘ధైర్యవంతుడైన ఆర్మీ జవాన్ తండ్రి రాహుల్కు క్లియర్ మేసేజ్ ఇస్తున్నారు. దేశమంతా ఒకటైన వేళ రాహుల్ గాంధీ కూడా చిల్లర రాజకీయాలు పక్కనపెట్టి దేశానికి రక్షణగా నిలవాలి’అని ట్వీట్ చేశారు.
‘ఇండియన్ ఆర్మీ చాలా స్ట్రాంగ్, చైనాను కచ్చితంగా ఓడించగలదు. రాహుల్ గాంధీ రాజకీయం చేయొద్దు. నా కొడుకు ఆర్మీలో పోరాడాడు. పోరాడుతూనే ఉంటాడు’ అని చైనా ఆర్మీ దాడిలో దెబ్బలు తగిలి ట్రీట్మెంట్ తీసుకుంటున్న సైనికుడి తండ్రి చెబుతున్న వీడియో ఒకటి వైరల్ అయింది. కాగా ఆ వీడియోనే అమిత్ షా పోస్ట్ చేసి రాహల్ గాంధీకి కౌంటర్ ఇచ్చారు. గాల్వాన్ విషయంలో రాహుల్ గాంధీ కొద్దిరోజులుగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో చెప్పాలని, ప్రభుత్వానికి దాడి గురించి తెలిసినా సైలెంట్గా ఉందని ఆయన విమర్శలు చేశారు. ఈ విషయంపై ట్విట్టర్ ద్వారా ప్రశ్నిస్తూనే ఉన్నారు.