![జూన్ రెండోవారంలో టెన్త్ ఎగ్జామ్స్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/05/exams.jpg?fit=1280%2C720&ssl=1)
- పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్సిగ్నల్
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి.. లాక్ డౌన్ నేపథ్యంలో వాయిదాపడిన టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ మొదటి వారం తర్వాత పరీక్షలు నిర్వహించుకోవచ్చని సూచించింది. కరోనా పరిస్థితులపై జూన్ 3న సమీక్షించి, 4న నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తే కరోనా నివారణ జాగ్రత్తలు పాటించాలని సూచించింది. కరోనా పరిస్థితులు తీవ్రంగా ఉంటే ఎగ్జామ్స్ నిర్వహించొద్దని స్పష్టం చేసింది.మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.
టెన్త్ పరీక్షలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని హైకోర్టుకు ప్రభుత్వం దాఖలుచేసిన అఫిడవిట్ పై విచారణ చేపట్టింది. ఎగ్జామ్ సెంటర్ల వద్ద అన్ని చర్యలు తీసుకుంటామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. కరోనా పరిస్థితులపై నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రతి పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఉండాలని సూచించింది. స్టూడెంట్స్ సౌలభ్యం కోసం హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎగ్జామ్స్ నిర్వహణకు అన్ని చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వివరించింది.