Breaking News

ఛార్మింగ్‌ గర్ల్‌.. హ్యాపీ బర్త్​ డే

ఛార్మింగ్‌ గర్ల్‌.. హ్యాపీ బర్త్​ డే

15 ఏళ్లకే ఎన్నో రోల్స్​

నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుని.. ప్రస్తుతం నిర్మాతగా పలు విభిన్న కథా చిత్రాలను సినీప్రియులకు అందిస్తున్నారు ప్రముఖ నటి ఛార్మి. మే 17(ఆదివారం) ఆమె పుట్టిన రోజు పురస్కరించుకుని అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. 15 ఏళ్లకే వెండితెరపైకి అడుగుపెట్టిన ఛార్మి గురించి చాలామందికి తెలియని కొన్ని ఆసక్తికర విశేషాలను ఆమె నిర్మాణ సంస్థ పూరీ కనెక్ట్స్‌ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.
15 ఏళ్లకే భార్య పాత్ర
2002లో విడుదలైన ‘నీ తోడు కావాలి’ చిత్రంతో ఛార్మి కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఛార్మి భార్య పాత్రలో కనిపించింది. నటనపరంగా తొలి చిత్రంతోనే ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేసింది. దీంతో ఆమెకు అవకాశాలు వరుసకట్టాయి. అలా దక్షిణాది భాషలతోపాటు హిందీ చిత్రాల్లో కూడా ఛార్మి నటించారు.
‘మంత్ర’ చిత్రానికి నంది వరించి..
బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌ లాంటి అగ్రకథానాయకుల చిత్రాలతోపాటు యువ హీరోలు ప్రభాస్‌, ఎన్టీఆర్‌, సుమంత్‌, నితిన్‌ సరసన కూడా ఛార్మి నటించింది. ‘మాస్‌’, ‘చక్రం’, ‘లక్ష్మి’, ‘రాఖీ’, ‘పౌర్ణమి’ చిత్రాలతో పాటు ‘అనుకోకుండా ఒకరోజు’, ‘మంత్ర’, ‘మంగళ’ వంటి కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటించి మెప్పించింది. సుమారు 50 సినిమాల్లో నటించిన ఛార్మి 2007లో విడుదలైన ‘మంత్ర’ సినిమాతో ఉత్తమ నటిగా నంది అవార్డును సొంతం చేసుకుంది. 2012లో విడుదలైన ‘మంగళ’ చిత్రానికి నంది స్పెషల్‌ జ్యూరీ అవార్డు కూడా వరించింది.
ఆరు భాషల్లో ప్రావీణ్యం
పంజాబీ కుటుంబానికి చెందిన ఛార్మికి మాతృభాషతో పాటు మరో ఐదు భాషలు తెలుసు. తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ, మరాఠి, తమిళం భాషల్లో ఆమె మాట్లాడగలదు.
చార్మి ముద్దు పేరు మావో..
ఛార్మి అందరితో కలివిడిగా ఉంటారనే విషయం తెలిసిందే. సినీ పరిశ్రమలోనే కాకుండా మిగిలిన రంగాల్లో కూడా ఆమెకు స్నేహితులు ఎక్కువ. అందువల్లే ఛార్మికి బాగా కావాల్సిన వారు ఆమెను ‘మావో’ అని పిలుస్తారు. అదే ఆమె ముద్దు పేరు.
మూగజీవులపై మక్కువ..
ఛార్మికి మూగజీవులంటే ఎంతో ఇష్టం. శునకాలతోపాటు పలు పక్షులనూ పెంచుకుంటున్నారు. వాటితో సరదాగా గడిపిన ఫొటోలను సైతం సోషల్‌ మీడియా వేదికగా ఆమె షేర్‌ చేస్తూ ఉంటుంది.
నిర్మాతగా ఛార్మి
పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జ్యోతిలక్ష్మి’ చిత్రంతో ఛార్మి నిర్మాతగా మారింది. 2015లో విడుదలైన ఈ సినిమాలో ఛార్మి టైటిల్‌ రోల్‌ పోషించింది. బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కిన ‘పైసా వసూల్‌’ చిత్రానికి కూడా ఆమె నిర్మాతగా పనిచేసింది. గతేడాది విడుదలైన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రంతో నిర్మాతగా మాస్‌ విజయాన్ని సొంతం చేసుకుంది.
హ్యాపీ బర్త్​ డే టు యూ
కాగా, పుట్టినరోజు పురస్కరించుకుని పలువురు సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ట్విటర్‌ వేదికగా ఛార్మిని విష్‌ చేశాడు. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ లేకపోవడంతో ఈ ఏడాది పుట్టినరోజును కుటుంబసభ్యులతోనే జరుపుకుంది. పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలను పూరీ కనెక్ట్స్ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసింది.