Breaking News

‘ఖైరతాబాద్’ లో సెంట్రల్ టీమ్ టూర్

'ఖైరతాబాద్' లో సెంట్రల్ టీమ్ టూర్
కంటైన్ మెంట్ జోన్ లో ఏర్పాట్లను
తెలుసుకుంటున్న అధికారులు

సారథి న్యూస్, హైదరాబాద్ : జ‌ల‌శ‌క్తి అద‌న‌పు కార్యదర్శి అరుణ్ భ‌రోకా నేతృత్వంలోని కేంద్ర అంత‌ర్ మంత్రిత్వ శాఖ‌ల అధికారుల బృందం సోమ‌వారం న‌గ‌రంలోని ఖైరతాబాద్ జోన్ లో పర్యటించింది.

హుమాయూన్ నగర్ కంటైన్ మెంట్ జోన్ ను సందర్శించిన‌ కేంద్ర బృందం డయాబెటిక్, పెరాల్సిస్, బీపీ, ఇతర అత్యవసర కేసులకు ఏ విధంగా సేవలు అందిస్తున్నారని, ఇంటింటికీ తిరిగి ప్రతిరోజూ నిర్వహిస్తున్న ఫీవర్ సర్వే, స్ప్రేయింగ్, స్పెషల్ శానిటేషన్ గురించి అధికారులతో చర్చించారు. ఆయా అంశాలపై తీసుకున్న చర్యల గురించి కేంద్ర బృందానికి జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ వివరించారు.

అనంత‌రం సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాన్ని ప‌రిశీలించింది. అక్కడున్న వ‌స‌తుల గురించి వాక‌బు చేశారు. అదే ఆవరణలో ఉన్న సెంట్రల్ డ్రగ్ స్టోర్ ను త‌నిఖీ చేసింది. అన్ని జిల్లాల‌లో ఉన్న‌ ప్రభుత్వ ఆస్పత్రుల‌కు ఏవిధంగా మందులు స‌ర‌ఫ‌రా చేస్తున్నారనే అంశాలపై చ‌ర్చించారు. అలాగే కరోనా పాజిటివ్ కేసుల‌కు వైద్య సేవ‌లందిస్తున్న వైద్యులు, ఇత‌ర సిబ్బంది వినియోగిస్తున్న వ్యక్తిగత రక్షణ ప‌రిక‌రాల కిట్లు, ఒకసారి వినియోగించి ప‌డ‌వేసే బెడ్‌షీట్లు, ట‌వ‌ల్స్‌, మాస్కుల నాణ్యతను ప‌రిశీలించారు.

ఆస్పత్రిలో ఏర్పాట్లను అడిగి
తెలుసుకుంటున్న కేంద్ర అధికారులు

జిల్లా ఆస్పత్రులు, ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలు, బ‌స్తీ ద‌వ‌ఖానాల‌కు ఇండెంట్ ప్రకారం మందుల‌ను ప్రత్యేక వాహ‌నాల ద్వారా పంపిస్తున్నట్లు వివరించారు. వ‌ర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మ‌లేరియా వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ముంద‌స్తుగా మందులు, స్ర్పేయింగ్ మెటీరియ‌ల్‌ను అన్ని జిల్లాల‌కు స‌ర‌ఫ‌రా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

అధికారుల బృందంలో ప్రజారోగ్యశాఖ సీనియ‌ర్ వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్ గెడం, జాతీయ పోష‌కాహ‌ర సంస్థ డైరెక్టర్ డాక్టర్ హేమ‌ల‌త‌, వినియోగ‌దారుల వ్యవహారాల శాఖ డైరెక్టర్ ఎస్‌ఎస్‌ ఠాకూర్‌, జాతీయ విప‌త్తు నివార‌ణ సంస్థ అసోసియేట్ ప్రొఫెస‌ర్ శేఖ‌ర్ చ‌తుర్వేది ఉన్నారు. కేంద్రబృందంతో పాటు జిహెచ్‌ఎంసీ క‌మిష‌న‌ర్ డీఎస్‌.లోకేష్ కుమార్‌, జోన‌ల్ క‌మిష‌న‌ర్లు ఎన్‌.ర‌వికిర‌ణ్‌, ప్రావీణ్య పాల్గొన్నారు.