Breaking News

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి

సారథి న్యూస్, హుస్నాబాద్: మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించించాలని కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్​వొడితల షమిత ఆకాంక్షించారు. సోమవారం హుస్నాబాద్ మున్సిపల్ ఆఫీసులో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆమె మాట్లాడారు. మహిళలు కేవలం ఇంటి పనులకే పరిమితం కాదని, వారంతా చైతన్యవంతులై అన్నిరంగాల్లోనూ రాణించాలన్నారు. మన దేశ సంస్కృతి సంప్రదాయాల్లో మహిళలకు విశేష ప్రాధాన్యం ఉందన్నారు. కొడుకుతో సమానంగా కూతుళ్లను చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని, నేటి పోటీ ప్రపంచాన్ని ఎదురుకునే విధంగా మహిళలు మానసికంగా ధృడంగా ఎదగాలన్నారు. దేశ ప్రగతిలో మహిళల పాత్ర కీలకమని, ప్రభుత్వాలు మహిళలకు అన్నింటా రిజర్వేషన్లు కల్పిస్తున్నాయన్నారు. కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు వైద్య, పారిశుధ్య, పలు రంగాల్లో మహిళలు పోషించిన పాత్ర మరువలేనిదన్నారు. ఆడపిల్లలను చదువులో మరింత ప్రోత్సహించడమే కాకుండా వారి కాళ్లపై వాళ్లు నిలబడేలా తల్లిదండ్రులు పోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో హుస్నాబాద్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి గూడ అనూష, మున్సిపల్ చైర్ పర్సన్ రజిత, వైస్ చైర్ పర్సన్ అనిత, కౌన్సిలర్లు నళనిదేవి, రమాదేవి, స్వర్ణలత, పద్మ, సుప్రజ, సరోజన, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

మహిళా దినోత్సవానికి హాజరైన మహిళలు