![ఎర్రటోపీలతో యూపీకి ప్రమాదం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/12/07HSB10.jpg?fit=518%2C350&ssl=1)
- వారు అధికారంలోకొస్తే ఉగ్రవాదులతో దోస్తీ
- ఎస్పీ నేతలపై ప్రధాని నరేంద్రమోడీ విమర్శలు
- గోరఖ్పూర్లో పలు కార్యక్రమాలకు శ్రీకారం
లక్నో: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఉత్తరప్రదేశ్లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అన్ని ప్రధాన పార్టీలతో పాటు పలు చిన్నాచితకా పార్టీలు కూడా వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. యూపీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ.. గోరఖ్పూర్లో మంగళవారం ఏర్పాటుచేసిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ వేదికపై నుంచే ప్రతిపక్ష సమాజ్వాది పార్టీపై ప్రధాని విమర్శలు గుప్పించారు. ఉత్తరప్రదేశ్లో మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలని ఎర్రటోపీలు ఎదురుచూస్తున్నాయని ఆ రాష్ట్ర మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాది పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘వాళ్లు అధికారంలోకొస్తే ఉగ్రవాదులతో దోస్తీ చేస్తారు. ఉగ్రవాదులను జైళ్ల నుంచి విడిచిపెడతారు. ఎర్రటోపీలే ప్రమాద ఘంటికలు. ఎర్రబుగ్గలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తారు’ అని బుగ్గకార్లలో తిరిగే రాజకీయ నాయకులను ఉద్దేశించి ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. సాధారణ ప్రజల సమస్యలు, బాధలు వారికి పట్టవని చెప్పారు. కుంభకోణాలకు పాల్పడటానికి, ఖజానా నింపుకోవడానికి, దొరికింది దోచుకోవడానికి, మాఫియా శక్తులకు స్వేచ్ఛనివ్వడానికే సమాజ్వాది పార్టీ అధికారంపై కన్నేసిందని ఆరోపించారు. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని ఈ పార్టీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటుందని, ఉగ్రవాదుల పట్ల అలసత్వం ప్రదర్శించడానికి ఆ పార్టీ ఇలా కోరుకుంటుందని చెప్పారు. గోరఖ్పూర్లో ప్రారంభించిన ప్రాజెక్టులు ‘నవీన భారతం’ నిర్మాణం ఏమాత్రం అసాధ్యం కాదనే విషయాన్ని చాటుతున్నాయని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.
పలు ప్రాజెక్టులను ప్రారంభించిన మోడీ
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గమైన గోరఖ్పూర్లో రూ.10వేల కోట్ల విలువైన మూడు మెగా ప్రాజెక్టులను ప్రధాని మంగళవారం ప్రారంభించారు. రూ.8,600 కోట్లతో నిర్మించిన ఎరువుల ఫ్యాక్టరీ, రూ.1,011 కోట్లతో నిర్మించిన ఎయిమ్స్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ రీజినల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ (ఐసీఎంఆర్, ఆర్ఎంఆర్సీ) కు చెందిన హైటెక్ ల్యాబ్ను ప్రధాని ప్రారంభించారు. యూపీ అభివృద్ధిలో యోగి ఆదిత్యనాథ్ పాత్రను ప్రధాని మోడీ ప్రశంసిచారు. ఆరోగ్యసేవలు ప్రతి ఒక్కరికీ అందాలన్నారు. ఆ దిశంగా యోగి సర్కార్ పనిచేస్తోందని చెప్పారు.