Breaking News

పోతారం నుంచి నీళ్లివ్వాలి

పోతారం గ్రావిటీ నుంచి నీళ్లివ్వాలి

సారథి న్యూస్, కోడిమ్యాల: జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం పోతారం రిజర్వాయర్​ నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా నీరందిస్తామని సాక్ష్యాత్తు మంత్రులే వచ్చి హామీలిచ్చి రెండేళ్లు గడిచినా ఇప్పటికీ పనులను ప్రారంభించలేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. గురువారం కోడిమ్యాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోతారం రిజర్వాయర్ మత్తడి మూడు మీటర్లకు పెంచి ముంపు బాధితులకు సరైన నష్టపరిహారం అందించాలని డిమాండ్​ చేశారు. ఎంతసేపూ సీఎం కేసీఆర్​ ఇక్కడి నుంచి నీళ్లను తీసుకెళ్లి తన సొంత వ్యవసాయ క్షేత్రానికి పారించుకోవాలనే ఆలోచనతో ఉన్నారని విమర్శించారు. పోతారం రిజర్వాయర్ ద్వారా శ్యామల చెరువుకు నీరందించాలని డిమాండ్​ చేశారు. కొడిమ్యాల మైసమ్మ చెరువు నుంచి గ్రావిటీ ద్వారా దిగువ గ్రామాలకు సాగునీరు అందించాలని కోరారు. లేకపోతే రైతులతో కలిసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ చొప్పదండి నియోజకవర్గ ఇన్​చార్జ్ ​మేడిపల్లి సత్యం, ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ చిర్ర ప్రవీణ్, మండలాధ్యక్షుడు చిలువేరి నారాయణ, ఉపసర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి, కేడీసీసీబీ డైరెక్టర్​ గుడి మాల్లిఖార్జున్​రెడ్డి, ఎంపీటీసీలు జమల్పూరి రాజేందర్, మల్యాల శోభన్, ఉపసర్పంచ్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.