Breaking News

పాలమూరు పచ్చబడాలి..

పాలమూరు పచ్చబడాలి.. ప్రాజెక్టు పనులు పరుగులు తీయాలి

హైదరాబాద్​: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పరుగులు పెట్టాలని, డిసెంబరు నాటికి పూర్తికావాలని సీఎం కేసీఆర్​ ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు స్ఫూర్తితో అధికారులు వేగంగా పనులు చేయాలని సూచించారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం వద్ద పంపులను జూన్ చివరి నాటికి బిగించాలని, టన్నెల్ పనులు కూడా అప్పటికల్లా పూర్తికావాలని స్పష్టం చేశారు. కాల్వ లైనింగ్ పనులను కూడా వేగవంతం చేయాలని సూచించారు. పాలమూరు ప్రాజెక్టుతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు సాగునీటి ప్రాజెక్టులపై ప్రగతి భవన్‌లో ఆదివారం సాయంత్రం సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు కాళేశ్వరంతో పోటీపడాలని, ఆ స్ఫూర్తిని పొందాలని, డిసెంబర్ డెడ్‌లైన్‌గా పూర్తి చేసుకోవాలని సీఎం పేర్కొన్నారు.

నీటిగోస తీర్చుకున్నం
‘తెలంగాణ ఉద్యమంలో మహబూబ్‌నగర్ నీటి గోసను, నల్లగొండ ఫ్లోరైడ్ కష్టాలను ప్రస్తావించకుండా నా ప్రసంగం సాగలేదని గుర్తుచేశారు. జూరాలతో సహా ఇప్పటికే మనం కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా లాంటి ఆన్-గోయింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసుకుని దక్షిణ పాలమూరుకు చెందిన 11 లక్షల ఎకరాలను పచ్చగా చేసుకునామని, ఇంకా వాటిల్లో కొసరు పనులు మిగిలాయని వివరించారు. సముద్రంవైపు ప్రవహించే కొద్దీ గోదావరి ప్రవాహం పెరుగుతూ ఉంటుందని, కానీ కృష్టానదికి మాత్రం ఆ వడి తగ్గుతూ ఉంటుందని సీఎం కేసీఆర్ వివరించారు. అందువల్ల తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన నీటివాటాను చుక్కనీరు పోకుండా వడిసిపట్టుకోవాల్సిందేనని, అందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సహా కృష్టానదిమీది అన్ని పెండింగ్ ప్రాజెక్టులనూ యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని సూచించారు.

డబ్బులకు ఇబ్బంది లేదు
నిధులకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఇరిగేషన్ శాఖలో వివిధ స్థాయి అధికారుల దగ్గర తగినంత డబ్బును అందుబాటులో ఉంచిందని గుర్తుచేశారు. డబ్బుల కోసం హైదరాబాద్ దాకా రానవసరం లేదని, ఎక్కడి అధికారి అక్కడే ఖర్చుచేస్తూ పనులను చేపట్టే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందని గుర్తుచేశారు. సమావేశంలో పాలమూరు జిల్లాకు చెందిన మంత్రులు ఎస్.నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు సి.లక్ష్మారెడ్డి, మర్రి జనార్ధన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, వీఎం అబ్రహం, టి.అంజయ్య యాదవ్, బి.కృష్ణమోహన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్.రాజేందర్‌రెడ్డి, సి.రామ్మోహన్ రెడ్డి, బి.హర్షవర్దన్‌రెడ్డి, సాగునీటిపారుదల సలహాదారు పెంటారెడ్డి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎస్ఈలు, పలువురు అధికారులు పాల్గొన్నారు.