Breaking News

‘ఏఐజీ’ కాదు.. ‘గాంధీ’లో చేరండి

‘ఏఐజీ’ కాదు.. ‘గాంధీ’లో చేరండి

సామాజిక సారథి, హైదరాబాద్: అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్​ కావడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో కాకుండా కార్పొరేట్ ​హాస్పిటల్​ ఏఐజీ(ఏషియన్ ఇనిస్టిట్యూట్​ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ)లో చేరడం ప్రభుత్వానికి సిగ్గుచేటని జైభీమ్​ యూత్​ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు ముకురాల శ్రీహరి విమర్శించారు. అత్యున్నతమైన స్థానంలో ఉన్న స్పీకర్ ప్రభుత్వ ఆస్పత్రులపై సామాన్యులకు నమ్మకం కలిగించాల్సింది పోయి ప్రజల సొమ్ముతో కార్పొరేట్​ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవడం చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ డాక్టర్లను అవమానించడమే అవుతుందన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ‘‘సీఎం కేసీఆర్​కు ఆరోగ్యం బాగాలేకపోతే యశోద హాస్పిటల్, స్పీకర్ కు కరోనా వస్తే ఏఐజీ ఆస్పత్రికి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర కార్పొరేట్ ఆస్పత్రులకు పోతున్నారు. కొవిడ్​ రోగుల చికిత్స కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన టిమ్స్​లో స్పీకర్ కు వైద్యం చేయించలేరా? కార్పొరేట్ ఆస్పత్రుల్లో తగ్గని కరోనాను గాంధీ హాస్పిటల్​లో తగ్గిస్తున్నారని రెండు రోజుల క్రితం ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్​రావు తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.’’ అని ముకురాల శ్రీహరి ప్రకటనలో పేర్కొన్నారు.

బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ డాక్టర్ ​ఆర్ఎస్ ​ప్రవీణ్ ​కుమార్ ​ఎన్నోసార్లు గాంధీ దవాఖానాలో వైద్యం చేయించుకొని నిజమైన ప్రజల నాయకుడిగా నిలిచారని గుర్తుచేశారు. ప్రభుత్వ దవాఖానాలపై పేదలకు నమ్మకం కలిగించారని పేర్కొన్నారు. వార్డు సభ్యుడి నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వైద్యం చేయించుకునేలా చట్టం తీసుకురావాలని డిమాండ్ ​చేశారు. స్పీకర్​ను తక్షణమే టిమ్స్ లేదా గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించాలని కోరారు. వైద్యశాఖ, డాక్టర్లను అవమానపరిచిన స్పీకర్ ​పోచారం శ్రీనివాస్​రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు.