![హల్దీవాగులోకి కొండపోచమ్మ నీళ్లు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/04/cm-kcr1.jpg?fit=548%2C277&ssl=1)
సారథి, గజ్వేల్: తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా అభివృద్ధి చేయాలనే తలంపులతో సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కార్యాచరణ కీలక మైలురాయిని దాటింది. ఇప్పటికే మెడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు చేరిన కాళేశ్వరం జలాలు అక్కడినుంచి కొండపోచమ్మ సాగర్ కు చేరాయి. మంగళవారం కొండపోచమ్మ సాగర్ నీళ్లను మొదట హల్దివాగులోకి విడుదల చేశారు. మంజీరా నది ద్వారా నిజాంసాగర్ కు తరలించే బృహత్తర కార్యక్రమం చేపట్టారు.
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/04/cm11.jpg?resize=640%2C342&ssl=1)
మంగళవారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అవుసులపల్లికి చేరుకున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అక్కడ కాళేశ్వరం జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి హల్దీవాగులోకి నీటిని విడుదల చేశారు. ఈ నీళ్లు పరిసర ప్రాంతాల్లోని పాములపర్తి చెరువు, పాతూరు చెరువు, ప్రజ్ఞాపూర్, గజ్వేల్, బయ్యారం తదితర 20 చెరువులను నింపుతారు. కార్యక్రమంలో స్పీకర్పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు తన్నీరు హరీశ్రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు సంతోష్ కుమార్, కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.