![పీవీ కూతురైతే ఓటేయాలా..?](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/03/sr11.jpg?fit=677%2C276&ssl=1)
సారథి న్యూస్, మహబూబ్నగర్: ఏ అర్హత ఉందని మీకు గ్రాడ్యుయేట్లు ఓట్లు వేయాలని హైదరాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి ముకురాల శ్రీహరి టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవిని ఉద్ధేశించి విమర్శించారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు కూతురుగా అర్హత ఉంటే సరిపోతుందా? అని ప్రశ్నించారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో గిరిజన విద్యార్థి వేదిక, బహుజన స్టూడెంట్యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఎందుకు వేయడం లేదని అడిగే నిరుద్యోగులకు ఏం చెబుతారని ప్రశ్నించారు. పీఆర్సీ, ఐఆర్ ఎందుకు ఇవ్వడం లేదో ఉపాధ్యాయ, ఉద్యోగులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్కు పదవీదాహం తీరలేదా? అని ప్రశ్నించారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావు నిరుద్యోగుల సమస్యలపై ఏనాడూ పల్లెత్తు మాట మాట్లాడ లేదని ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్ధరలు ప్రజల జీవనంపై తీవ్రప్రభావం చూపుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నంచడం లేదన్నారు. బీజేపీ ప్రభుత్వానికి బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాశనం కావడానికి మాజీమంత్రి జి.చిన్నారెడ్డి వారే కారణమని విమర్శించారు. నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు తనను గెలిపిస్తే మండలిలో ప్రజాగొంతుకగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని అన్నారు. కార్యక్రమంలో నాయకులు గోపాల్రాథోడ్, శ్రీరాములు, అబ్బాస్పాల్గొన్నారు.