- న్యూఇయర్ వేడుకలపై పోలీస్ ఆంక్షలు
- స్థానికులకు ఇబ్బంది కలిగించినా చర్యలు
- తాగి రోడ్లపై హంగామా చేస్తే కటకటాలే
- హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ హెచ్చరిక
సామాజికసారథి, హైదరాబాద్: డిసెంబర్ 31 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైన్ షాపులు, పబ్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇస్తే.. మరోవైపు హైదరాబాద్ పోలీసులు మాత్రం న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ పోలీస్ కొత్త బాస్ సీవీ ఆనంద్ ఒక ప్రకటన విడుదల చేశారు. న్యూ ఇయర్ పార్టీల్లో డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పబ్లు, రెస్టారెంట్లకు పక్కన ఉన్న స్థానికులను ఇబ్బందులకు గురిచేయొద్దని సూచించారు. ఇక, స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు.. ఎక్కడైనా, ఎవరైనా కొవిడ్ రూల్స్ను అతిక్రమిస్తే కఠినచర్యలు తీసుకుంటామని సీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. ఈవెంట్లకు పరిమితికి మించి పాసులను అమ్మొద్దని స్పష్టం చేశారు. పార్టీల్లో డ్రగ్స్ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈవెంట్లలో జనాల్లోకి సింగర్స్ వెళ్లొద్దని సూచించారు. ఇక, రెండూ డోసులు తీసుకున్న వారికే మాత్రమే ఈవెంట్లకు అనుమతివ్వాలని ఈవెంట్ల నిర్వాహకులకు ఆదేశాలు జారీచేశారు. డిసెంబర్ 31న రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఐదు గంటల వరకు ఫ్లైఓవర్లను మూసివేస్తున్నట్లు వెల్లడించారు.. మద్యం తాగి రోడ్లపై హంగామా చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రంకెన్డ్రైవ్లో పట్టుబడితే తీవ్రచర్యలు ఉంటాయన్నారు. 31న రాత్రి ఆకస్మికంగా డ్రంకెన్డ్రైవ్లు నిర్వహిస్తామన్నారు. మాస్క్ లేకుండా కనిపిస్తే జరిమానాలు విధిస్తామని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.