- విహారయాత్రల పేరుతో వసూళ్లు
- ఏటా సమ్మర్ లో ఆ నలుగురు టూర్లు
- వసూలు రాజాలు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్
- కొందరు విలేకర్ల తీరును ‘ఛీ’ కొడుతున్న జనం
సామాజికసారథి, బిజినేపల్లి: సమ్మర్ వచ్చిందంటే చాలు ఆ నలుగురు వాలిపోతున్నారు. విహార యాత్రల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారు. బిజినేపల్లి మండలంలో ఓ నలుగురు విలేకర్ల తీరు చర్చనీయాంశంగా మారింది. వృత్తికే మచ్చ తెస్తున్నారని తోటి రిపోర్టర్లు.. తమను పట్టిపీడిస్తున్నారని అధికారులు గుర్రమంటున్నారు. సమ్మర్ వెకేషన్ వచ్చిందంటే సాధారణంగా విహారయాత్రలకు ప్లాన్ చేయడం తెలిసిందే. బిజినేపల్లి మండలంలో కొందరు టూర్ల పేరుతో వసూళ్లకు పాల్పడటం విమర్శలకు దారితీస్తోంది. అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి రాబట్టారు. ఇవ్వకపోతే బెదిరింపులకు కూడా గురిచేసినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. మొత్తం రూ.2.50లక్షలు వసూలు చేసి చెక్కేశారంటూ ఒకరికొకరు ఫోన్లు చేసుకుని మరీ చెప్పుకుంటున్నారు. ఇదిలాఉండగా, గతంలో కూడా ఇలాగే పలువురి నుంచి కొంత సొమ్మును రాబట్టి వారం రోజుల పాటు గోవా తదితర ప్రాంతాలకు వెళ్లి వచ్చారు. మళ్లీ అదే సీన్ రిపీట్ కావడంతో వీళ్లకు పనేమీ లేదా..? అంటూ డబ్బులు ఇచ్చినవాళ్లు గునుక్కుంటున్నారు. నలుగురు చేసిన పనికి వ్యవస్థకే చెడ్డపేరు వస్తుందని తోటి రిపోర్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.