![మతపెద్దలు సహకరించండి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/04/hsbd-2.jpeg?fit=644%2C366&ssl=1)
సారథి, సిద్దిపేట ప్రతినిధి: దేశంలో భిన్నత్వంలో ఏకత్వం విరాజిల్లుతోందని హుస్నాబాద్ ఏసీపీ ఎస్.మహేందర్ అన్నారు. మంగళవారం అక్కన్నపేట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన మతపెద్దల సమావేశంలో మాట్లాడారు. పల్లె నుంచి పట్నం వరకు కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన నిబంధనలు పాటించి పండుగలను ఎవరి ఇంట్లో వాళ్లు జరుపుకోవడమే కాకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదన్నారు. రామనవమి, రంజాన్, మహావీర్ హనుమాన్ జయంతి వేడుకలను భక్తులు, తమ ఇళ్లల్లోనే జరుపుకోవాలని మతపెద్దలకు సూచించారు. మాస్కులు లేకుండా కొవిడ్-19 నిబంధనలు పాటించని వారిపై విపత్తు నిర్వహణ, ఐపీసీ188 సెక్షన్ల క్రింద చట్టప్రకారం కేసునమోదు చేసి రూ.వెయ్యి జరిమానా విధించడంతో పాటు రాత్రి 9గంటల నుంచి ఉదయం 5గంటలకు కర్ఫ్యూ అమల్లో ఉందన్నారు. కార్యక్రమంలో హుస్నాబాద్ సీఐ రఘు, ఎస్సై రవి, సర్పంచ్ సంజీవరెడ్డి, వివిధ మతాలకు చెందిన పెద్దలు షాబుద్దీన్, అన్వర్ పాష, కృష్ణ, సత్యం, సామేశ్, సమ్మయ్య, నిజాముద్దీన్, నజీర్, అజీమియా, సర్వర్ పాషా పాల్గొన్నారు.