Breaking News

చిచ్చురేపిన బీజేపీ పోస్టర్​

చిచ్చురేపిన బీజేపీ పోస్టర్​

  • నాగర్​కర్నూల్​ ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డిపై అనుచిత పోస్టర్​
  • బీజేపీ నాయకులపై పోలీసులకు టీఆర్ఎస్​ నేతల ఫిర్యాదు

సామాజికసారథి, నాగర్​కర్నూల్​ ప్రతినిధి: నాగర్​కర్నూల్​ ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డిపై బీజేపీ నాయకులు రూపొందించిన ఓ పోస్టర్​చిచ్చురేపింది. ‘ఎమ్మెల్యేను ప్రజాహంతకుడు నల్లమట్టి దొంగ’గా సంబోధిస్తూ వేసిన పోస్టర్​ రాజకీయంగా వివాదానికి దారితీసింది. ఇదిలాఉండగా, తమ పొలాలు నీటి ముంపునకు గురవుతున్నాయని, పంటలు పండించుకోలేకపోతున్నామని.. ఉయ్యలవాడకు చెందిన దళితరైతు కాశన్న ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయమై బీజేపీ నాయకులు ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డిని నల్లమట్టి దొంగగా అభివర్ణిస్తూ.. రైతు చావుకు కారణమయ్యాడని పోస్టర్ ను రూపొందించారు. దీనిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్​రావు, నియోజకవర్గ ఇన్​చార్జ్ ​దిలీపాచారి రాష్ట్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు చేశారు. రైతులను ఇబ్బంది పెడుతున్న ఎమ్మెల్యేను విడిచిపెట్టేది లేదని ప్రకటించారు.

పోస్టర్​ విడుదల చేస్తున్న బీజేపీ నాయకులు(ఫైల్​)

ఖండించిన టీఆర్ఎస్ ​నాయకులు
నాగర్​కర్నూల్​ ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డిని ప్రజాహంతుడిగా, నల్లమట్టి దొంగ అని, ఉయ్యాలవాడ కాశన్నది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనన చిత్రీకరిస్తూ బీజేపీ నాయకులు పోస్టర్ ​రూపొందించి సోషల్ ​మీడియాలో ప్రచారం చేశారని, ఇది ఎమ్మెల్యే పరువుకు భంగం కలిగించిందని, ఈ ఆరోపణలు పూర్తి అవాస్తవని టీఆర్ఎస్​ నాయకులు ఖండించారు. ఈ అవాస్తవ ఆరోపణలు నియోజకవర్గంలో రెండువర్గాల మధ్య చిచ్చుపెట్టిందని, ప్రజాశాంతికి భంగం కలిగే అవకాశం ఉన్నదని తెలిపారు. అవాస్తవాలు ప్రచారం చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్​రావు, అసెంబ్లీ ఇన్​చార్జ్ ​దిలీపాచారిపై చర్యలు తీసుకోవాలని జెట్టి ధర్మరాజు పేరుతో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.