Breaking News

తెలంగాణ న్యాయవాదికి అరుదైన గౌరవం

తెలంగాణ న్యాయవాదికి అరుదైన గౌరవం

న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన సీనియర్‌ న్యాయవాది పి.నిరూప్‌ సుప్రీంకోర్టు సీనియర్‌ అడ్వకేట్‌ గా నియమితులయ్యారు. డిసెంబర్‌ 8న ఫుల్‌ కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రం నుంచి సుప్రీంకోర్టు ఎంపికచేసిన మొట్టమొదటి సీనియర్‌ అడ్వకేట్‌ నిరూప్‌ కావడం విశేషం. నిరూప్‌ తండ్రి మాజీమంత్రి పి.రామచంద్రారెడ్డి కూడా స్వయాన న్యాయవాది. ఆయన మూడు దశాబ్దాలుగా సుప్రీంకోర్టులో సేవలు అందిస్తున్నారు. 31 జాతీయ ప్రాముఖ్యత కలిగిన కేసుల్లో తీర్పులు నివేదించారు. ముఖ్యంగా ప్రైవేట్‌ ఇంటర్​నేషనల్​లా, ఎన్విరాన్‌ మెంటల్‌ లా, ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్​లా, ల్యాండ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ లా, కాన్‌ స్టిట్యూషనల్‌ లాకు సంబంధించి వాదించిన కేసుల్లో వచ్చిన తీర్పులు నిరూప్‌ కెరియర్‌ లో మైలురాళ్లుగా నిలిచాయి. సోలీసోరాబ్జీ, నారిమన్‌, రోహింటన్‌, కె.పరాశరణ్‌, పి.చిదంబరం తదితర సీనియర్‌ అడ్వకేట్లతో కలిసి పనిచేశారు. అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా వీఆర్‌ రెడ్డి, మాజీ సొలిసిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా గోపాల్‌ సుబ్రమణ్యం వద్ద నిరూప్‌ సుదీర్ఘకాలం పాటు పనిచేశారు. 2013–16 మధ్య సుప్రీంకోర్టులో గోవా, ఢిల్లీ ఫోరంలకు సీనియర్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌ న్యాయవాదిగా పనిచేశారు. ఢిల్లీ, మేఘాలయ రాష్ట్రాలకు అడషనల్​అడ్వకేట్‌ జనరల్‌ గా కూడా పనిచేశారు. న్యాయవాదిగా తండ్రి వారసత్వం కొనసాగిస్తూ నిరూప్‌ మెదక్‌ ముఫిసిల్‌ కోర్టు నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ సుప్రీంకోర్టు వరకు సుదీర్ఘ ప్రయాణం సాగించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రం తరఫున వాదనలు వినిపించేందుకు స్థానిక సీనియర్‌ అడ్వకేట్లు ఎవరూ లేరు. ఇప్పుడు నిరూప్‌ నియామకంతో ఆ సమస్య తీరినట్లయింది.