Breaking News

శంకరం.. లోక శంకరం

శంకరం.. లోక శంకరం

‘శివతత్వమే మన తత్వమని, అదే మానవత్వం’ అని బోధించారు మహిమాన్విత మూర్తి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు. హైందవ ధర్మాన్ని సంరక్షించుకునేందుకు జన్మించిన అపరశంకరులే ఈ భగవత్పాదువారు. భరతఖండం భిన్నకులాల సమాహారం.

ఈ భిన్న కులాలను ఏకత్వం వైపు నడిపి అద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహాపురుషుడు. హిందూధర్మానికి దశ, దిశ నిర్దేశించిన నిర్దేశకుడు ఆది శంకరాచార్యులవారు. ఆస్తికత్వాన్ని స్థాపించి హైందవం అనే మహావృక్షానికి జీవం పోసిన మహానుభావులు. ఇలాంటి అవతార పురుషులు అవతరించిన పుణ్యదినం ఏప్రిల్ 28న శంకర జయంతిని జరుపుకుంటారు.

జగద్గురు ఆదిశంకరాచార్యులు
హిందూ మత పరిరక్షణ కోసం అవతరించిన సరళ సిద్ధాంతవేత్త ఆదిశంకరాచార్యులు. జగద్గురు ఆది శంకరాచార్య క్రీ.పూ.509 (విభవ నామ సంవత్సరం) వైశాఖ శుద్ధ పంచమి తిథి రోజున కర్ణాటక లగ్నమందు శివుడి జన్మనక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు, శని, గురుడు, కుజుడు ఉచ్చస్థితిలో ఉండగా కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ, శివగురుకు కేరళలోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడిలో జన్మించారు.

శంకరం.. లోక శంకరం
ఆదిశంకరాచార్యులు

కాలడి ఇప్పటి త్రిచూర్ కు కొద్ది మైళ్ల దూరంలో ఉంది. ఆర్యమాంబ, శివగురు త్రిచూర్ లోని వృషాచల పర్వతంపై ఉన్న శివుడిని ప్రార్థించి ఆయన అనుగ్రహంతో పుత్రుడిని పొందారు. ‘పార్వతీదేవి, సుబ్రహ్మణ్య స్వామికి ఏవిధంగా జన్మనిచ్చిందో ఆర్యమాంబ శంకరులకు అలాగే జన్మనిచ్చింది’ అని శంకరవిజయం చెబుతోంది. ఆయన జనన కాలం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ, కంచి తదితర పీఠాలు అంగీకరించినవి, మనహిందూ గ్రంథాల ప్రకారం ఆయన జీవన కాలం క్రీ.పూ477– 509 అని తెలుస్తోంది.

అలంపూర్ జోగుళాంబ ఆలయ సన్నిధిలో శంకరాచార్యుల ఉత్సవాలు నిర్వహిస్తున్న అర్చకులు, వేదపండితులు

శంకరాచార్యులు తన రెండవ యేటనే రాయడం, గ్రంథాలను చదవడం నేర్చుకున్నారు. తన మూడవ యేటనే తండ్రి చనిపోయాడు. ఆయనకు ఐదవ యేటనే కామ్యోపనయనం చేశారు.

ఏడవ యేట వచ్చేసరికి వేదాలను అధ్యయనం చేసేవారు. కారణజన్ములైన శంకరాచార్యులవారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి విందభగవత్పాదాచార్యులవారి వద్ద శాస్త్ర అధ్యయనం చేశారు.

ఒకసారి శంకరులు పాలను నైవేద్యంగా పెట్టి వాటిని స్వీకరించడానికి అమ్మవారు రాలేదని తీవ్రంగా విలపిస్తుండగా ఆ తల్లి ఆయన ముందు ప్రత్యక్షమై తన ఒడిలోనికి తీసుకుని ఆ పాలను తాగించి తన కరుణకటాక్షాలను ఆ చిన్నిశంకరులపై ప్రసరింపచేసింది. ఇంకొకసారి ఆయన వేదాభ్యసన సమయంలో భిక్ష కోసం ఒక పేద వృద్ధురాలి ఇంటికి వెళ్లి యాచించగా, ఆమె తన ఇంటిలో ఉన్న ఒకే ఒక ఉసిరికాయను ఆయనకు ఇచ్చేసింది.

ఆమె పరిస్థితికి జాలిపడిన శంకరులు సంపదలకు అధినేత అయిన లక్ష్మీదేవిని స్తుతిస్తూ.‘ కనకధారాస్తవం’ ఆశువుగా పలికారు. దానికి ఆ తల్లి సంతోషించి బంగారు ఉసిరికాయల వర్షం కురిపించిందట. శంకరుల తల్లి ఆర్యాంబ వృద్ధాప్యం కారణంగా పూర్ణానదికి రోజూ స్నానానికి వెళ్లలేకపోవడం గమనించి అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్థించి నదిని ఇంటివద్దకు తెప్పించారు.

ఆవిధంగా నదీ ప్రవాహం మార్గం మారే సరికి గ్రామప్రజలు శంకరులు జరిపిన కార్యానికి ఆశ్చర్యపడ్డారు. తన తపస్సు శక్తితో ఆ నదినే తన ఇంటి సమీపంగా ప్రవహించగలిగేలా చేశారు. గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారత యాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ, ‘ప్రాత:కాలం, రాత్రి, సంధ్యాసమయాల్లో ఏసమయంలోనైనా, స్పృహలో ఉన్నపుడూ, స్పృహ లేనపుడూ నన్ను తలచుకోగానే, నీవద్దకు వస్తాను’ అని శంకరులు తల్లికి మాటిచ్చారు. తల్లి అంతిమ సమయంలో వచ్చి, అంతిమ సంస్కారాలు చేస్తానని చెప్పారు.
గురువు దర్శనం
ఆయన గురువు గురించి అన్వేషిస్తూ నర్మదా నదీ తీరంలో ఉన్న శ్రీశ్రీ గోవింద భగవత్పాదులను దర్శించి ఆయనే తన గురువు అని తెలిసికుని తనను శిష్యుడిగా స్వీకరించమని ప్రార్థించారు. గోవింద భగవత్పాదులు ఆయనను అనేక పరీక్షలకు గురిచేసి, శంకరుల అద్వైత సిద్ధాంతంతో సంతృప్తి చెంది ఆయనను శిష్యుడిగా చేర్చుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి గురువుగారి అనుమతితో విశ్వనాథుడి దర్శనానికి మరియు వ్యాసమహర్షి దర్శనానికి కాశీ(వారణాసి) బయలుదేరారు.
ఆహాన్ని తొలగించేందుకు..
ఆయనలో అంతర్గతంగా ఉన్న ఆహాన్ని తొలగించేందుకు పరమశివుడు చండాలుని వేషంలో వెంట నాలుగు కుక్కలతో వచ్చి ఆయన దారికి అడ్డుగా నిలబడతాడు. అప్పుడు శంకరులు చండాలుని పక్కకు తొలగమని చెబుతారు. అప్పుడు శివుడు ‘ఎవరిని తొలగమంటున్నావు, ఈ శరీరాన్నా లేక ఈ శరీరంలో ఉండే ఆత్మనా’ అని ప్రశ్నిస్తాడు.

దీంతో శంకరులకు ఆ వచ్చినవాడు పరమశివుడే తప్పా వేరేకాదని గ్రహించి ఆయనను స్తుతిస్తూ మనీషాపంచకం చదివారు. ఆయన బ్రహ్మసూత్రాలకు భాష్యాలే కాక అనేక దేవీదేవతల స్తుతులు, అనేక ఆధ్యాత్మక సిద్ధాంత గ్రంథాలూ రచించారు. వాటిలో బాగా ప్రాచుర్యం పొందినవి సౌందర్యలహరి, శివానందలహరి, భజగోవిందం మొదలైనవి.

తల్లికి సేవ
ఆయన సన్యాసాశ్రమ నియమాలను పక్కన పెట్టి మరీ తల్లికి ఆమె కోరిక మేరకు ఆమెకు అంత్యేష్టి కార్యక్రమాలను నిర్వహించారు. ఆ విధంగా తల్లి అత్యంత పూజనీయురాలనీ, ఆమెకు సేవ చేయడం బిడ్డల కర్తవ్యమనీ దానికి ఎలాంటి నియమాలు అడ్డురావనీ లోకానికి చాటిచెప్పారు. తల్లికిచ్చిన మాట కోసం తల్లి అవసానదశలో శ్రీకృష్ణభగవానుని లీలలను చూపించి సంతోషపరిచాడు.

ఆయన కాలినడకన దేశమంతా తిరిగి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ తన సిద్ధాంత వాదనలతో అనేక మంది పండితులను ఓడించారు. ఆ తర్వాత వాళ్లు ఆయనకి శిష్యులయ్యారు. వారిలో కుమారిలభట్టు, మండవమిశ్రుడు మొదలైన వారు కూడా ఉన్నారు. ఆయన ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతానికి ఆకర్షితులై ఆయన శిష్యులుగా మారిన వారిలో ముఖ్యులు త్రోటకుడు, పద్మపాదుడు, సురేశ్వరుడు, పృథ్వీవరుడు వంటి వారు ఉన్నారు.

గణేశ పంచరత్న స్తోత్రం, భజ గోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, కనకథారా స్తోత్రం, శివానందలహరి, సౌందర్యలహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్యప్రార్థనా స్తోత్రాలుగా ఈనాటికీ ఉపయుక్తమవుతున్నాయి. ఆయన 108 గ్రంథాలు రచించారు.


పీఠాల స్థాపన
శృంగేరి.. బదరి .. పూరీ.. ద్వారక అనే పవిత్రమైన ప్రదేశాల్లో పీఠాలను స్థాపించారు. ఆదిశంకరులవారి శిష్యులే అద్భుతమైన రీతిలో మహిమలను ప్రదర్శించారంటే, ఇక శంకరులవారి శక్తులు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. శంకరుల చిన్నతనంలో ఆయన అనన్యసామాన్యమైన భక్తిని చాటే అనేక సంఘటనలు జరిగాయి. ధర్మసంస్థాపన చేయడానికి ఆయన దేశం నలువైపులా నాలుగు పీఠాలను స్థాపించారు.

తూర్పువైపున ఒడిశాలోని పూరీలో గోవర్ధన మఠం, దక్షిణం వైపున కర్ణాటకలోని శృంగేరిలో శారదామఠం, పశ్చిమ దిక్కున గుజరాత్ లోని ద్వారకలో ద్వారకామఠం, ఉత్తర దిక్కున ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ లో జ్యోతిర్మఠం స్థాపించారు. అవి ఈనాటికీ, ధర్మరక్షణకు పాటుపడుతున్నాయి.


మఠం.. పీఠం
సన్యాసులు, బ్రహ్మచారులు నివసించేది మఠం. అక్కడ దేవతను ప్రతిష్ఠించిన తర్వాత అది పీఠంగా మారుతుంది. శంకరులు దేశం నాలుగు మూలలా నాలుగు మఠాలను స్థాపించారనేది జగద్విదితం. వీటినే చతుర్మఠాలని, మఠామ్నాయాలని పిలుస్తారు. చతుర్మఠాల స్థాపన శంకరుల వ్యవస్థా నైపుణ్యానికి, కార్యనిర్వహణ దక్షతకు తార్కాణం.

హిందూధర్మాన్ని పునరుజ్జీవింపచేయడానికి, సుస్థిరపర్చడానికి, వ్యాప్తి చేయడానికి కేంద్రాలుగా పనిచేసే ఈ నాలుగు మఠాల నిర్వహణ క్రమం, అప్పటి(వందల ఏళ్ల)నుంచి ఇప్పటి వరకు అవిచ్ఛిన్నంగా సాగుతోంది.

చతుర్ మఠాలు
1.ద్వారకా మఠం
ఈ మఠం శంకరులచే, దేశానికి పశ్చిమంగా, మొదటగా స్థాపించారు. దీనిని కాళికామఠమనీ, సిద్ధేశ్వరమఠమనీ, పశ్చిమామ్నాయ మఠమని పిలుస్తుంటారు.
2.గోవర్ధన మఠం
దీనినే పూర్వామ్నాయ మఠం పిలుస్తారు. ఇది దేశానికి తూర్పున ఉన్న పూరీ పట్టణంలో ఉంది.
3.శృంగేరీ మఠం
ఇది దక్షిణామ్నాయమఠమని, శారదాపీఠమని పిలుస్తున్నారు. కర్ణాటకలోని శృంగేర(శృంగ లేక ఋష్యశృంగ)లో ఈ మఠం స్థాపించారు.
4.జ్యోతిర్మఠం
దీనిని ఉత్తరామ్నాయమని, బదరికాశ్రమమని కూడా అంటుంటారు.
5.శంకర మఠం(కంచికామకోటి పీఠం)
సాక్షాత్తూ శంకరాచార్యుడు అద్వైత మత పరిరక్షణ కోసం దేశం నాలుగు దిక్కులా ఏర్పరచిన నాలుగు మఠాలు పైవి. ఇవి కాకుండా, శంకరుడు విదేహ ముక్తిపొందిన కంచి మఠం ఐదోవది.
‌‌‌‌ 32వ యేట..
ఒకరోజు శంకరులు గంగానది ఒడ్డున శిష్యులకు తాను చేసే ప్రవచనం ముగించి వెళ్తుండగా వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అక్కడకు వచ్చాడు. శంకరులు రాసిన భాష్యాల మీద చర్చకు దిగాడు. 8రోజులపాటు చర్చ జరిగిన తర్వాత వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో వచ్చింది సాక్షాత్తు వ్యాసుడేనని పద్మపాదుడు గ్రహించి ఆ విషయం శంకరులకు తెలిపగా, శంకరులు వ్యాసుడికి సాష్టాంగ ప్రణామం చేసి, తన భాష్యాలపై ఆయన అభిప్రాయం కోరగా వ్యాసుడు సంతోషించి బ్రహ్మసూత్రాలు అసలు అర్థాన్ని గ్రహించింది శంకరులు మాత్రమేనని ప్రశంసించాడు. వేదవ్యాసుడు వెళ్లిపోతుండడం చూసి శంకరులు ‘నేను చేయాల్సిన పని అయిపోయింది.

నాకు ఈ శరీరం నుంచి విముక్తి ప్రసాదించు’ అని వేడుకున్నాడు. అప్పుడు వ్యాసుడు ‘లేదు, అప్పుడే నీవు జీవితాన్ని చాలించొద్దు. ధర్మ వ్యతిరేకులు అనేకమందిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే నీ కారణంగా రూపుదిద్దుకుని, ఇంకా శైశవ దశలోనే ఉన్న ఆధ్యాత్మిక స్వేచ్ఛానురక్తి అర్థాంతరంగా అంతరించే ప్రమాదం ఉంది.

నీ భాష్యాలను చదవగా కలిగిన ఆనందంలో నీకు వరాన్ని ఇవ్వాలని అనిపిస్తోంది. బ్రహ్మ నీకు ఇచ్చిన ఎనిమిది ఏళ్ల ఆయుర్థాయానికి అగస్త్యాది మునుల అనుగ్రహంతో మరో ఎనిమిది ఏళ్లు తోడయింది. పరమశివుని కృపచేత నీకు మరొక 16 ఏళ్లు ఆయుష్షు లభించుగాక’ అని దీవించి అంతర్థానం అయ్యాడు. ఆయన జన్మించినప్పుడు ఆయుష్షు ఎనిమిది ఏళ్లు, తపస్సు వల్ల సాధించింది ఇంకొక ఎనిమిది ఏళ్లు, వ్యాసమహర్షి అనుగ్రహం ద్వారా మరొక 16 ఏళ్లు జీవించి తన 32వ యేట ఉత్తరాఖండ్ కాశీలో దేహాన్ని త్యజించారు.

ధర్మోరక్షతి రక్షితః
అలాంటి శంకరులవారిని ఆయన జయంతి సందర్భంగా స్మరించుకోవడంకన్నా పుణ్యం ఏముంటుంది. అత్యంత భక్తిశ్రద్ధలతో శంకరులవారిని ఆరాధించాలి. పేద బ్రాహ్మణులకు శక్తి కొద్ది దానధర్మాలు చేయాలి. వారి పిల్లల ఉన్నత విద్య, ఉపనయనాలకు ఆర్థికపరమైన సహాయ సహకారాలు అందించాలి.

ఆధ్యాత్మిక పరమైన పవిత్రతను కాపాడుతూ దేవాలయాల అభివృద్ధికి పాటుపడాలి. ఇప్పుడు హిందువులంతా తమలో నిద్రాణమై ఉన్న ఆదిశంకరులను జాగృతం చేయాలి. ప్రతి హిందువు శంకరుడు అవ్వాలి. ఆయన మనకు స్ఫూర్తి. ఆయన మనలోనే, మనతోనే ఉన్నారు.

కలియుగంలో గురువైన ఆదిశంకరాచార్యులు రక్ష మనపై ఉంటుంది. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని అనుసరించు.. ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది.

భారతదేశాన్ని ఒక ఆధ్యాత్మిక వనంగా మార్చి, అడుగడుగునా భక్తిభావ సుమాలను వికసింపజేసిన అపరశంకరులు.. ఆదిశంకరులను

స్మరించుకోవడం కన్నా పుణ్యమేముంటుంది..!
!! జయ జయ శంకర హర హర శంకర!!
!! జయ జయ శంకర హర హర శంకర !!

– దిండిగల్ ఆనంద్ శర్మ , అలంపూర్ సెల్ నం.96660 06418

One thought on “శంకరం.. లోక శంకరం”

Comments are closed.