Breaking News

లాక్‌ డౌన్ నిబంధనలివే..

లాక్‌ డౌన్ నిబంధనలివే..
  • మే 31వరకు కొనసాగింపు
  • కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు

సారథి న్యూస్, న్యూఢిల్లీ: లాక్‌ డౌన్ పొడిగింపుపై కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 31వ తేదీ వరకు పొడిగిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న కేంద్రం అందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఆదివారం విడుదల చేసింది. మెట్రో, విమాన సేవలు అందుబాటులో ఉండవని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా హాట్‌స్పాట్స్‌లో ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు ప్రకటించింది. స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు మూసివేసి ఉంటాయని స్పష్టం చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లు తెరిచేందుకు అనుమతి లేదని కేంద్రం తేల్చి చెప్పింది. సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, జిమ్ సెంటర్లు, స్విమింగ్ పూల్స్, బార్లు, ఆడిటోరియాలు, అసెంబ్లీ హాల్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను తెరిచే పరిస్థితి లేదని కేంద్రం ప్రకటించింది.

ప్రతిరోజూ రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగుతుందని స్పష్టంచేసింది. కంటైన్​మెంట్​, రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లపై రాష్ట్రాలదే అధికారం అని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రాల పరస్పర అనుమతితో ప్రజారవాణా వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది. అన్ని రకాల మతపరమైన కార్యక్రమాలపై నిషేధం కొనసాగుతుందని పేర్కొంది. రెస్టారెంట్లకు హోం డెలివరీ అందించేందుకు మాత్రమే వెసులుబాటును కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.