Breaking News

రూ.1200 కోట్లతో చెక్ డ్యాంలు

-మంత్రి హరీశ్​రావు

సారథి న్యూస్, మెదక్: వృథానీటికి అడ్డుకట్ట వేయడం, భూగర్భ జలాల పెంపు, రైతుల సాగునీటి కష్టాలు తీర్చడమే లక్ష్యంగా రూ.1200 కోట్ల నాబార్డ్ నిధులతో రాష్టవ్యాప్తంగా ప్రభుత్వం చెక్ డ్యామ్ లు నిర్మిస్తోందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు ప్రకటించారు. బుధవారం ఆయన మెదక్​ ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్​రెడ్డితో కలిసి హవేలిఘనపూర్​ మండలం సర్ధన వద్ద మంజీరా నదిపై చెక్​ డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. హవేలి ఘనపూర్​లో డబుల్​ బెడ్​ రూం ఇళ్లను ప్రారంభించారు. మెదక్​ పట్టణంలో డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మెదక్ లో టీఎన్​జీవో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్​రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్​ సాగునీటి కష్టాలను పూర్తిగా దూరం చేసేందుకు ప్రాజెక్టులు, చెక్ డ్యాంలకు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్​ కు నీళ్లు వచ్చిన వెంటనే అక్కడి నుంచి హల్దీ ప్రాజెక్ట్​ ద్వారా మెదక్​ మండలంలోని బొల్లారం మత్తడికి చేరుతాయని చెప్పారు. దీంతో హవేలి ఘనపూర్​ మండల పరిధిలోని కూచన్​పల్లి, సర్ధన చెక్​డ్యాంలకు నీరు వస్తాయన్నారు. తద్వారా సింగూర్​, ఘనపూర్​ ఆనకట్ట నిండకున్నా బొల్లారం మత్తడి ద్వారా మహబూబ్​నహర్​ కాల్వ కింద 13వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.

మంజీరా నదిమీద సంగారెడ్డి, మెదక్​ జిల్లాల పరిధిలో 15 చెక్​ డ్యాంలు నిర్మించిన ఘనత టీఆర్​ఎస్​ ప్రభుత్వానిదే అన్నారు. తద్వారా 25వేల ఎకరాల్లో పంటలు సాగవుతాయని, భూగర్భజలాలు వృద్ధిచెంది బోర్ల ఆధారంగా పంటలు సాగుచేసే వేలాది మంది రైతులకు మేలు కలుగుతుందన్నారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్​ ధర్మారెడ్డి, అడిషనల్​ కలెక్టర్​ నగేష్​, ఇఫ్కో డైరెక్టర్​ దేవేందర్​రెడ్డి, జడ్పీ వైస్​ చైర్మన్​ లావణ్యరెడ్డి, మెదక్ చైర్మన్​ చంద్రపాల్​, హవేలి ఘనపూర్​ ఎంపీపీ నారాయణరెడ్డి పాల్గొన్నారు.