Breaking News

మైదాకు ఆషాఢంలోనే ఎందుకు పెట్టుకోవాలి?

మైదాకు ఆషాఢంలోనే ఎందుకు పెట్టుకోవాలి ?

సారథి న్యూస్​, నర్సాపూర్: సంస్కృతంలో గోరింట చెట్టును మేంధికా అంటారు. ఆ పదం నుంచే మెహిందీ అనే పదం వచ్చింది. ప్రాచీన కాలం నుంచి సౌందర్య, ఆరోగ్య సంరక్షణ సాధనాల్లో గోరింటాకుకు ప్రత్యేక స్థానం ఉంది. ఆయుర్వేదం ప్రకారం గోరింట ఆకులు, పూలు, వేర్లు, బెరడు, విత్తనాలు అన్ని ఔషధ గుణాలు కలిగినవే. గ్రీష్మరుతువు పూర్తయి వర్షరుతువు మొదలయ్యే సమయంలో మన శరీరం వేడితో కూడుకుని ఉంటుంది. ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. అంతవరకూ వేడిని తట్టుకున్న శరీరం ఒక్కసారిగా వాతావరణంలో ఆకస్మికంగా వచ్చే మార్పులతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
గోరింటాకులో ఔషధగుణం
గోరింటాకుకు వేడిని తగ్గించే గుణం ఉండడంతో బయటి వాతావరణానికి అనుగుణంగా శరీరాన్ని చల్లబరిచి అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడుతుంది. వర్షాకాలంలో సహజంగా కాళ్లూచేతులు తడవకుండా పనులు జరగవు. ఇలా కాళ్లూచేతులు నాని చర్మవ్యాధులు, గోళ్లు దెబ్బతినడం వంటి సమస్యలు ఎదురవుతాయి. గోరింటాకులో ఉండే ఔషధగుణం ద్వారా ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉంటుంది. అంతే కాకుండా వీటి వల్ల అండాశయాల పనితీరు సక్రమంగా ఉండి సంతానోత్పత్తి అవకాశాలు పెరగడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా వృద్ధి చెందుతుంది.
సౌభాగ్యానికి ప్రతీక
ఆధ్యాత్మికంగా గోరింటాకును సౌభాగ్యానికి ప్రతీకగా చెప్పుకుంటున్నారు. మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ద్వారా సౌభాగ్యాన్ని పొందుతారాని పెద్దలు చెబుతారు. అదృష్టానికి, ఆరోగ్యానికి గోరింటాకును ప్రతీకగా అరబ్ దేశాల్లో ఐదువేల ఏళ్ల క్రితమే వాడినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇటీవల కృత్రిమ పదార్థాలతో తయారుచేసిన గోరింటాకును విరివిగా వాడడం ద్వారా చర్మరోగాలు వస్తున్నాయి.